KTR: ప్రమాదాన్ని దాచిపెట్టిన ప్రభుత్వం.. అసెంబ్లీ సెషన్ టైమ్‌లోనే ఘటన

by Gantepaka Srikanth |
KTR: ప్రమాదాన్ని దాచిపెట్టిన ప్రభుత్వం.. అసెంబ్లీ సెషన్ టైమ్‌లోనే ఘటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జున్ సాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న సుంకిశాల రీటెయినింగ్ వాల్ కూలిన ఘటనపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతున్నది. గత ప్రభుత్వం తప్పిదమంటూ డిప్యూటీ సీఎం సహా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆరోపిస్తుండగా, ఇంజినీర్లు హెచ్చరిస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మరీ హడావిడిగా గేట్ల నిర్మాణం చేపట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఘటనకు పురపాలక మంత్రిగా సీఎం రేవంత్, ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గేటుతో సహా రీటెయినింగ్ వాల్ ఆగస్టు 2వ తేదీ ఉదయం కూలిపోయిందని, ప్రభుత్వం బైటకు పొక్కకుండా గోప్యంగా దాచిపెట్టిందని, అసెంబ్లీ సెషన్ జరుగుతున్నా సీఎం స్టేట్‌మెంట్ ఇవ్వకుండా తప్పించుకున్నారని తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, చేతగానితనం, చేవలేనితనం కారణంగానే సుంకిశాల ప్రమాదం జరిగిందని, నిజంగా ప్రస్తుత ప్రభుత్వం తప్పు లేనట్లయితే వారం రోజులపాటు ఎందుకు దాచిపెట్టిందని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన విషయం ప్రభుత్వానికి తెలియదా?.. లేక తెలిసినా గోప్యంగా ఉంచాలనుకున్నదా?.. అని నిలదీశారు. ప్రభుత్వానికి ఈ విషయం తెలియదనుకుంటే అది సిగ్గుచేటైన వ్యవహారమన్నారు. పురపాలక శాఖ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి ఆ శాకను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రిదే బాధ్యత వహించాలన్నారు. కానీ గత ప్రభుత్వ తప్పిదమంటూ డిప్యూటీ సీఎం సహా మంత్రులంతా ఎదురుదాడి చేయడం చిల్లర పాలిటిక్స్ అని ఆరోపించారు. మంచి జరిగితే వారి క్రెడిట్‌లో వేసుకుని లోపాలకు బీఆర్ఎస్‌ను నిందించడం సమంజసం కాదన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై బురద చల్లారని, కానీ ఇప్పుడు 12 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నా అది సేఫ్‌గానే ఉన్నదని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలం అనే వారి కామెంట్లే నిజమైతే పంపింగ్ ద్వారా రిజర్వాయర్లను ఎలా నింపుతున్నదని ప్రశ్నించారు. మేడిగడ్డ డ్యామేజ్ విషయంలో ఆగమేఘాల మీద వచ్చిన ఎన్డీఎస్ఏ హడివిడిగా రిపోర్ట్ ఇచ్చిందని, ఇప్పుడు సుంకిశాల విషయంలో ఆ వేగం ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. సుంకిశాల రీటెయినింగ్ వాల్ డిజైన్‌లో ఎలాంటి ఇంజనీరింగ్ లోపం లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనా విధానంలోనే లోపమున్నదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed