- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Harish Rao: ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? హరీశ్ రావు సీరియస్

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాపాలన కాదు, మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన అంటూ మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా గ్రామసభల్లో ప్రజలను అధికారులను ప్రశ్నిస్తున్న వీడియోలను పోస్ట్ చేశారు. మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న (Grama Sabalu) గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందని పేర్కొన్నారు. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే మీ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతున్నదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలి అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసుల పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణమన్నారు.
అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా?
పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే, మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటని ఆరోపించారు. అలాంటపుడు గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లేనా? అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా? అని ప్రశ్నించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. అర్హులైన అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల పాపం, అధికారులకు శాపంగా మారిందని, సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందన్నారు.
యావత్ తెలంగాణ మీ దుర్మార్గ పాలనను నిలదీస్తోంది
మీరు నిర్వహిస్తున్న గ్రామ సభలు, ఆరు గ్యారెంటీలు అమలు, రుణమాఫీ చేయడం, పంట బోనస్ ఇవ్వడం, రైతు భరోసా అమలు, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక అన్ని దగా.. అంటూ ఆరోపించారు. నేడు యావత్ తెలంగాణ ఏకమై మీ దుర్మార్గ పాలనను నిలదీస్తున్నదని, అడుగడుగునా ప్రశ్నిస్తున్నదని అన్నారు. మరి ఇప్పుడు వారిపై ఎన్ని కేసులు పెడతరు.. ఎంత మందిని అరెస్టులు చేస్తారని అన్నారు. మీ రాక్షస పాలనలో విసిగి, వేసారి పోయిన తెలంగాణ ప్రజలు ఉప్పెనగా ఉద్యమించక ముందే కళ్లు తెరవండి అని హితభోద చేశారు. ప్రతిపక్షాల మీద బురద జల్లడం మాని పరిపాలన మీద దృష్టి సారించాలన్నారు. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.