అక్కడ రేవంత్ రెడ్డే బీజేపీకి ఓట్లు మళ్లీంచారా..? సీఎంను ఇరుకున పెట్టిన హరీష్ రావు

by Satheesh |
అక్కడ రేవంత్ రెడ్డే బీజేపీకి ఓట్లు మళ్లీంచారా..? సీఎంను ఇరుకున పెట్టిన హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్ముక్కు అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్, కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మెదక్‌లో బీజేపీని బీఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదని చురకలంటించారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బీఆర్ఎస్ మెజారిటీ సాధించిందని గుర్తు చేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బీఆర్ఎస్ మెజారిటీ సాధించిందని నొక్కి చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో బీజేపీకి మెజారిటీ వచ్చింది.. మరీ రేవంత్ రెడ్డే అక్కడ బీజేపీకి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్‌ పార్లమెంట్‌లో బీజేపీ ఎలా గెలిచిందని, మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. మరీ వారంతా కలిసి బీజేపీని గెలిపించారా అని నిలదీశారు. కొడంగల్ అసెంబ్లీ నుండి రేవంత్ రెడ్డి 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారని, మరీ పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 21 వేల మెజారిటీ మాత్రమే వచ్చిందని, మిగతా ఓట్లను రేవంత్ రెడ్డి బీజేపీకి వేయించారా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరిలో బీజేపీ భారీ మెజారిటీతో ఎలా గెలిచిందని, ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీని గెలిపించిందా..? అని క్వశ్చన్ చేశారు.

బీజేపీ పంచన చేరింది, మోడీ శరణు చొచ్చింది రేవంత్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ ఎజెండా అమలు చేస్తున్నది వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. నిండు సభలో ప్రధాని మోడీని పెద్దన్న అని సంబోధించింది రేవంత్ రెడ్డని గుర్తు చేశారు. మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కై సింగరేణని ప్రైవేటు పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విభజన హామీలపై రేవంత్ రెడ్డి మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదని మండిపడ్డారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ శక్తి అయిన బీఆర్ఎస్‌ను టార్గెట్ చేశాయని ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు.

Advertisement

Next Story