KCRను సీఎం చేయడమే లక్ష్యం.. పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Rajesh |
KCRను సీఎం చేయడమే లక్ష్యం.. పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమ తన లక్ష్యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మరో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో ఎర్రబెల్లి మాట్లాడారు. కేసీఆర్ పాలనలోనే రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇపుడు రైతులు ఎంత ఆందోళనలో ఉన్నారో ఓ సారి రేవంత్ రెడ్డి సమీక్షించుకోవాలని సూచించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లో రైతుల పరిస్థితి ఘోరంగా మారిందన్నారు.

రైతులకు సాయం అనే సరికి కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు, షరతులు పెడుతోందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు చిన్న ఇబ్బంది జరగలేదని గుర్తు చేశారు. పాత కాంగ్రెస్ ప్రభుత్వ రోజులు మళ్ళీ వచ్చాయన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల సమస్యలపై ధర్నాలు చేశారన్నారు. అలాంటి పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవద్దన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. కేసీఆర్‌ను మళ్ళీ సీఎం ను చేయడమే తన లక్ష్యమన్నారు.

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతాంగం గొంతు కోయడమే కాంగ్రెస్ ప్రభుత్వం పని అన్నట్టుగా ఉందన్నారు. ఎన్నికల ముందు ప్రజలను నమ్మబలికి మోసం చేశారన్నారు. ఈ పాటికే రైతు బందు పడాల్సిందని.. రేవంత్ ప్రభుత్వం వచ్చి మూడు సీజన్లు అవుతోందన్నారు. రైతు భరోసా కాదు కదా రైతు బంధు కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం వేసి జూలై 15 దాకా డెడ్ లైన్ పెట్టారన్నారు. అప్పటికే నాట్లు వేసే పని పూర్తవుతుందని తెలిపారు. సీజన్ అయిపోయాక రైతు భరోసా ఇస్తారా ? అని ప్రశ్నించారు. రైతు భరోసాకు అర్హులెవరో ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదన్నారు. 68 లక్షల 90 వేల మందికి ఒక కోటి 52 లక్షల ఎకరాలకు 11 విడతల్లో 72 వేల కోట్లు రూపాయలను కేసీఆర్ హయాంలో రైతు బంధు కింద ఇచ్చామన్నారు. 2 వేల 603 క్లస్టర్‌లు రాష్ట్రంలో ఉన్నాయని..

ప్రతి క్లస్టర్‌లో 5 వేల ఎకరాలు ఉంటాయన్నారు. డాటా అంతా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. రైతు భరోసా కు మంత్రి వర్గ ఉపసంఘం వేయడం కుంటి సాకు మాత్రమే అన్నారు. ఈ ఆధునిక యుగంలో లబ్ధిదారులను ఎంపిక చేయడం ఓ గంట పని ఎక్కడైనా ఒక్కటో అరో పొరపాట్లు జరిగితే సవరించుకోవడం పెద్ద పని కాదన్నారు. మంత్రి వర్గ ఉపసంఘం పేరుతో కొద్ది మందికే రైతు భరోసా ఇచ్చే కుట్రకు తెర లేపారన్నారు. రైతు భరోసాకు పట్టాదారు పాస్ పుస్తకాలే ప్రామాణికం కావాలన్నారు. రెవెన్యూ రికార్డులు వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయని.. వాటి ప్రకారం ఇవ్వాలన్నారు. డిసెంబర్ 9 న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు కేబినెట్‌లో చర్చించడం విడ్డూరమన్నారు. కేసీఆర్‌ను గుడ్డిగా వ్యతిరేకించడమే కొందరి పనిగా మారిందన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన మంచిని మంచిగా చెప్పడం కొందరికి నచ్చడం లేదని సెటైర్లు వేశారు.

Advertisement

Next Story