శాస్త్రాలకు అనుగుణంగా భద్రాచలం ఆలయ విస్తరణ పనులు చేపట్టాలి: మంత్రి పొంగులేటి

by Mahesh |
శాస్త్రాలకు అనుగుణంగా భద్రాచలం ఆలయ విస్తరణ పనులు చేపట్టాలి: మంత్రి పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: భద్రాచలం ఆలయ విస్తరణకు ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో భూసేకరణ పనులు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి చేపడుతున్న భూసేకరణ, ఆలయ విస్తరణ పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సచివాలయంలోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ లతో కలిసి వేములవాడ, భద్రాచలం, బాసర దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ శాస్త్ర నియమాలను తప్పకుండా, సహజంగా దేవాలయ విస్తరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కల్యాణ మండపానికి అనుబంధంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో మండపాన్ని నిర్మించాలన్నారు. దేవాలయ విస్తరణలో భాగంగా కుసుమ హరనాథ దేవాలయానికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. త్వరలోనే ఆలయాన్ని సందర్శించి, పరిసరాలను తిరిగి కచ్చితమైన నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు మరో 100 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేవాలయ నిర్వహణ విషయంలో ఆగమ శాస్త్రాలకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో, అంతే ప్రాధాన్యతను భక్తుల సౌకర్యాల కల్పనకు ఇవ్వాలన్నారు. వేములవాడ ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేలా షాపుల నిర్వహణలో యజమానులకు మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. గంగా జమున తెహజీబ్ ను ప్రతిబింభించే వేములవాడ దేవాలయం లోని దర్గా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధిని చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాసర లో ప్రస్తుతం 2 రాజగోపురాలు మాత్రమే ఉండగా, వీటిని నాలుగు పెంచాలని సూచించారు. ప్రాకారం, గోపురాలు, గర్భగుడి పనులను ప్రారంభించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం సత్రాలు, గదులపై మంత్రి ఆరా తీశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

నిర్మాణ పనులు చేసేటప్పుడు భక్తులకు ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు. వేములవాడ ఆలయ గోశాలలోని ఆవులు, కోడెల ఉచిత పంపిణీ విధివిధానాలను అధికారులు మంత్రికి వివరించారు. అదే విధంగా ధర్మ గుండాన్ని కేవలం స్వామి వారి అభిషేకానికి కేటాయించి, భక్తుల సౌకర్యార్థం మరో ధర్మ గుండాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో నిర్వహించే ‘దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు’ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, బాసర, వేములవాడ, భద్రాచలం ఈవోలు విజయ రామారావు, వినోద్, రమాదేవి, స్థపతి ఎన్. వల్లి నాయగన్, ఎస్ఈ కె.దుర్గాప్రసాద్, సహాయ స్థపతి పి. గణేషన్, ప్రధానార్చకులు ఉమేష్, ప్రవీణ్ పాఠక్, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed