Cm Revanth Reddy: రైతులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ కు గ్లోబల్ యానిమల్ హెల్త్ కంపెనీ

by Prasad Jukanti |
Cm Revanth Reddy:  రైతులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ కు గ్లోబల్ యానిమల్ హెల్త్ కంపెనీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జొయిటిస్ హైదరాబాద్​లో తమ కేపబులిటీ సెంటర్‌ను విస్తరించాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్​‌బాబు, అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు తాజాగా సమావేశమయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలను ప్రారంభించేందుకు సంస్థ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జోయిటిస్ ఇండియా కేపబులిటీ సెంటర్‌ను విస్తరించే నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయన్నారు. తద్వారా వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నాయన్నారు. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో జోయిటిస్ రంగ ప్రవేశం హైదరాబాద్‌కు మరింత గుర్తింపు తెస్తుందన్నారు. కాగా ఈ కంపెనీ దాదాపు 70 ఏళ్లుగా జంతువుల అనారోగ్యం, రోగ నిర్ధారణ, నిరోధించే మార్గాలు, చికిత్స సంబంధిత అంశాలపై దాదాపు వందదేశాల్లో పని చేస్తున్నది. జంతు సంరక్షణలో భాగంగా పశువైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, రైతులకు అండగా నిలుస్తున్నది.

మా ప్రభుత్వంపై నమ్మకానికి ఇది నిదర్శనం..

జొయిటిస్ కంపెనీ విస్తరణ రాష్ట్రంలో ఉన్న వనరులు, తమ ప్రభుత్వ విధానాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించిందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. రాబోయే సంవత్సరాల్లో కొత్త ఉద్యోగాలతో పాటు జంతు ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జోయిటిస్‌ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్ మాట్లాడుతూ.. ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. జోయిటిస్ ఇండియా కేపబులిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి ప్రతిభా వనరులను సద్వినియోగం చేసుకుంటామని, అలాగే రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటామని పేర్కొన్నారు.

సీఎంకు బయోడిజైన్ టీమ్ లేఖ..

ముఖ్యమంత్రి బృందం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో బయోడిజైన్ స్టాన్‌ఫోర్డ్ బైర్స్ సెంటర్ సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ బయోడిజైన్ తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపించింది. సమావేశంలో ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణ, విద్య, నైపుణ్యాభివృద్ధిలో సహకారం, తెలంగాణలో రాబోయే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, కొత్త లైఫ్ సైన్సెస్ యూనివర్శిటీ స్థాపనలో భాగస్వామ్యాలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న వివిధ రంగాలపై ముఖ్యమంత్రి బృందం చర్చించింది. అలాగే నాలెడ్జ్ మార్పిడి, ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలు, తెలంగాణలో స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ కోసం శాటిలైట్ సెంటర్‌ ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా స్టాన్‌ఫోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ బృందం తెలంగాణ ప్రభుత్వానికి సహకరించడానికి సుముఖతను వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖను అందించింది.

Advertisement

Next Story