కాంగ్రెస్ తీరుతో సబ్సిడీలు, రైతులకు ఉచిత కరెంటు బంద్: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

by Satheesh |
కాంగ్రెస్ తీరుతో సబ్సిడీలు, రైతులకు ఉచిత కరెంటు బంద్: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ బిల్లుల వసూలును ప్రయివేటు కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతుందన్నారు. విద్యుత్ బిల్లుల వసూలును ఆదానీకి అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రయివేటు వ్యక్తుల చేతికి విద్యుత్ బిల్లులు వసూలు పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న పాతబస్తీకే పరిమితం కాదన్నారు. రాష్ట్రం మొత్తం విద్యుత్ బిల్లుల వసూలు ప్రయివేటు చేతిలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సబ్సిడీలు, రైతులకు ఉచిత కరెంటు ఇక రాష్ట్రంలో ఉండదన్నారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు పెడతారన్నారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చినా విద్యుత్ రంగాన్ని ప్రయివేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని కేసీఆర్ అంగీకరించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం, మోడీ కనుసన్నల్లో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోడీ, అదానీ విధానాలను తెలంగాణలో రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ సంస్థ ప్రజల ఆస్తి దీన్ని ప్రయివేటు వ్యక్తులకు అప్పచెప్తున్నారన్నారు. ఓల్డ్ సిటీలో 45 శాతం మాత్రమే కరెంటు బిల్లులు వసూలు అవుతున్నాయని, అందుకే ప్రయివేటు వ్యక్తులకు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారు.. ఇది ఓల్డ్ సిటీ ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయన్నారు. సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తుంటే డిప్యూటీ సీఎం భట్టి వేలంలో పాల్గొన్నారని, శ్రావణ్ పల్లి బొగ్గు గనిని వేలం నుండి ఎందుకు తీసివేయించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదని స్పష్టం చేశారు.

సింగరేణి బొగ్గు గనులను లీజుకు తీసుకున్న కంపెనీలను తాము అనుమతించమని బీఆర్ఎస్ ఇప్పటికే అభిప్రాయం చెప్పిందని వెల్లడించారు. విద్యుత్ బిల్లుల వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగుల పాత్ర నామమాత్రంగా మారే అవకాశం ఉందన్నారు. ప్రయివేటు వాళ్లకు అప్పగిస్తే విద్యుత్ వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, ఓల్డ్ సిటీలో ఆ లోపు కరెంటు బిల్లు వచ్చే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటి వరకు విద్యుత్ శాఖా మంత్రి మాట్లాడలేదని, దీనిపై అనుమానాలకు తావిస్తోందన్నారు.

Next Story