గాంధీ ఆసుపత్రికి నీ లాంటి దొరలు రారు.. నాలాంటి పేదలు వస్తారు : కేటీఆర్ మీద దామోదర రాజనర్సింహ ఫైర్

by M.Rajitha |
గాంధీ ఆసుపత్రికి నీ లాంటి దొరలు రారు.. నాలాంటి పేదలు వస్తారు : కేటీఆర్ మీద దామోదర రాజనర్సింహ ఫైర్
X

దిశ; తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ దవాఖాన్లను నాశనం చేసే కుట్రలు ఇకనైన బంద్ చేస్తే బెటర్ అంటూ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. గాంధీ హాస్పిటల్‌పై బురద జల్లి, ఇక్కడికి ట్రీట్‌మెంట్ కోసం వచ్చే నిరుపేదల మనో స్థైర్యాన్ని దెబ్బతీయడం బాధాకరమని ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పిటళ్లు ఏ విధంగా ఎదిగాయో ప్రజలందరికీ తెలుసునని చురకలు అంటించారు. ప్రభుత్వ దవాఖాన్లను ఎలా దెబ్బతీశారో కూడా జనాలు ఇప్పటికీ మర్చిపోలేదని స్పష్టంచేశారు. గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ దవాఖాన్లను పది సంవత్సరాల పాటు నాశనం చేసిన బీఆర్‌‌ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే తరహా కుట్రలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

గాంధీ వంటి టెర్షియరీ కేర్ హాస్పిటళ్లకు అత్యంత విషమంగా ఉన్న పేషెంట్లు వస్తారని, చివరి నిమిషం వరకూ వాళ్ల రోగాన్ని నయం చేసి, ఎలాగైనా వాళ్లను బ్రతికించేందుకు డాక్టర్లు తమ శక్తిమేరకు ప్రయత్నిస్తుంటారని గుర్తు చేశారు. అయితే అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల దురదృష్టవషాత్తు కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దేశంలోని ఏ టెర్షియరీ కేర్ హాస్పిటల్‌లోనైనా, ప్రతి నెలా పదుల సంఖ్యలో మరణాలు జరుగుతుంటాయని క్లారిటీ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే మరణాలు జరిగాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నంబర్లను భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అజ్ఞానికి, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే ఆయన సహజ గుణానికి ఆయన మాటలు అద్దం పడుతున్నాయని వెల్లడించారు. గాంధీ ప్రతిష్టను దెబ్బతీసి, అక్కడికి పేషెంట్లను రానీయకుండా చేసి కార్పొరేట్ హాస్పిటళ్లకు లబ్ది చేకూర్చాలని ఆయన కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. ఆ కుట్రలో భాగంగానే గాంధీ హాస్పిటల్‌పై బురద జల్లుతున్నారన్నారు. ఇకనైనా ఇలా పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేయడం మానుకోకపోతే, ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని నొక్కి చెప్పారు. ‘‘గాంధీ దవాఖానకు వచ్చేది నీ లాంటి దొర జనం కాదు, నా పేద ప్రజలు. నేను కూడా పాత గాంధీ హాస్పిటల్‌లోనే పుట్టిన. ఆ ఆసుపత్రికి వచ్చే పేదల బాగోగులు చూసుకోవడం నా బాధ్యత అని ఇదివరకే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను.”అంటూ హెల్త్ మినిస్టర్ స్పష్టం చేశారు. బీఆర్‌‌ఎస్ కుట్రలను నమ్మి ఎవరూ భయపడొద్దని, ధైర్యంగా వచ్చి చికిత్స చేయించుకోవాలని మంత్రి వివరించారు. పదేళ్లు నాశనం చేసిన వ్యవస్థలను ఇప్పుడిప్పుడే చక్కదిద్దుతున్నామని మంత్రి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed