టార్గెట్ ‘25’.. తెలంగాణలో పార్టీ బలోపేతానికి CPI భారీ స్కెచ్

by Satheesh |
టార్గెట్ ‘25’.. తెలంగాణలో పార్టీ బలోపేతానికి CPI భారీ స్కెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై సీపీఐ ఫోకస్ పెట్టింది. పట్టున్న 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలపడటంపై కసరత్తు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలన్నదానిపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని జాతీయ నాయకత్వం నొక్కిచెప్పింది. పార్టీ బలం పెంచుకోకుండా ఎన్నికల్లో ముందుకు సాగలేమని నాయకత్వం భావిస్తోంది. పొత్తుల్లోనూ బలం నిరూపించుకోవాల్సిందేనని డిసైడ్ అయ్యింది.

రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు పగ్గాలు చేపట్టాక పార్టీ పటిష్టత పైన, ప్రచారంపైన ప్రత్యేకంగా దృష్టి సారించారని నాయకులు చెబుతున్నారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆయన వ్యహారచన చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సీపీఐ వచ్చే నెల 3 నుంచి జిల్లా మహాసభలు నిర్వహించ తలపెట్టింది. 3న సూర్యాపేట, 4 నిజామాబాద్, 5 కొమురం భీం, 6 కొత్తగూడెం, 7 ఖమ్మం, 8 మేడ్చల్, 9 ఆదిలాబాద్, 10 రంగా రెడ్డి, 11 హన్మకొండ జిల్లాలో మహాసభలు నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసింది.

పార్టీ నిర్మాణ సభలు

జిల్లాలో మహాసభలతో పాటు వచ్చే నెల 22 నుంచి 24వ తేదీ వరకు హన్మకొండలో పార్టీ నిర్మాణ సభలు ఏర్పాటు చేసేందుకు సీపీఐ పార్టీ నాయకత్వం అడుగులు వేస్తోంది. ఈ సమావేశాలలో పార్టీ నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. ఈ సమావేశాలకు సీపీఐ అగ్రనేతలను రప్పించేందుకు రాష్ట్ర నాయకత్వం యత్నాలు చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed