CM Revanth Reddy: ప్రభుత్వ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. అక్కడ ఫ్రీ ఎంట్రీ

by Prasad Jukanti |
CM Revanth Reddy: ప్రభుత్వ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. అక్కడ ఫ్రీ  ఎంట్రీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు పరిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసీ ప్రక్షాణల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని గుర్తు చేశారు.

విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని:

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలో పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందు కోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన జీవోను ఇప్పటికే జారీ చేశామన్నారు. చారిత్రక, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని తీసుకువచ్చినట్లు ఈ సందర్భంగా సీఎం వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ సాయి ప్రసాద్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.

అసెంబ్లీ బిల్డింగ్ పునరుద్దరణ:

ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరిస్తున్నామని సీఎం చెప్పారు. త్వరలోనే అందులో శాసన మండలి ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం శాసనమండలి కొనసాగుతున్న జూబ్లీ హాల్ కు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్తులో దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందన్నారు. జూబ్లీహాల్ ను దత్తత తీసుకొని పరిరక్షించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఐఐకి సూచించారు. అలాగే ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని, హైకోర్టు భవనం, సిటీ కాలేజ్, పురానాపూల్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సి ఉందన్నా్రు. ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్టు కొనసాగుతుందని వెల్లడించారు.

మెట్ల బావులు దత్తత:

నగరంలోని ఆయా పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఈ మేర‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ఒప్పంద పత్రాలు అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణకు ఇన్పోసిస్, మంచిరేవుల మెట్ల బావిని సాయి లైఫ్ సంస్థ, సాలార్ జంగ్, అమ్మపల్లి బావుల‌ను భారత్ బయోటెక్ సంస్థ, అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ, ఫలక్ నుమా మెట్ల బావిని టీజీ ఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్దరించేందుకు ముందుకు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed