అకాల వర్షం ఎఫెక్ట్.. రైతులకు సివిల్ సప్లైస్ కమిషనర్ గుడ్ న్యూస్

by Disha Web Desk 2 |
అకాల వర్షం ఎఫెక్ట్.. రైతులకు సివిల్ సప్లైస్ కమిషనర్ గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి ధాన్యానికి, ఇతర పంటలకు నష్టం జరిగిందని, తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సివిల్ సప్లైస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పష్టత ఇచ్చారు. చివరి గింజ వరకూ కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొంటుందని, తడిచిపోయిందనే ఆందోళన రైతులకు అవసరం లేదని భరోసా కల్పించారు. వర్షం కారణంగా ధాన్యం తడిచిపోయిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. స్వంత స్థలంలో కాకుండా అద్దెకు నడుపుతున్న కేంద్రాల రెంట్‌ను కూడా రైతుల నుంచి వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, ఈ భారాన్ని రైతుల మీద నెట్టకుండా సొసైటీలు, ఐకేపీ భరిస్తాయని వివరించారు. ఇకపైన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లను, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్లను ఆదేశించారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించి తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొంటుందని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు కూడా తరలిస్తామన్నారు.

Next Story