టార్గెట్ ఎలక్షన్స్.. ఆసక్తిగా మారిన బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్!

by GSrikanth |   ( Updated:2023-04-27 04:57:55.0  )
టార్గెట్ ఎలక్షన్స్.. ఆసక్తిగా మారిన బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఎగరేసిన తర్వాత పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నారు. సూమారు 300 మంది పార్టీ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర నాయకులు ఉన్నారు. సమావేశంలో మొత్తం 16 రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, విస్తృతంగా చర్చించి, వాటిని ఆమోదించనున్నారు. అక్టోబర్ 10న వరంగల్ మహాసభ నిర్వహణపై సైతం తీర్మానం చేయనున్నట్లు తెలిసింది. ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, బీఆర్ఎస్‌కు జాతీయ స్థాయిలో ఆదరణ లభిస్తున్నదని, అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పే అవకాశముంది. దీని ద్వారా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయనున్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల్లో పోటీచేయాలని కూడా తీర్మానం చేయనున్నట్లు సమాచారం.

సంక్షేమం.. కేంద్ర వైఫల్యాలపై..

రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతోపాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిసింది. దేశంలో ధరల పెరుగుదల, విభజన అంశాలపై వివక్ష, మెడికల్ కాలేజీలు, ఫ్యాక్టరీల కేటాయింపులో వివక్ష, రుణాల్లో కోత, ప్రాజెక్టులకు జాతీయ హోదా తదితర వాటిపై చర్చించనున్నట్లు సమాచారం. అదే విధంగా సింగరేణి గనుల వేలం, గిరిజన రిజర్వేషన్లు, పసుపుబోర్డు, ఐటీఐఆర్ రద్దు అంశాలపై ప్రత్యేకంగా తీర్మానం చేయనున్నట్లు తెలిసింది. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం తదితర అంశాలపై డిస్కషన్ చేయనున్నట్లు సమాచారం.

శ్రేణులకు దిశా నిర్దేశం

బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందడం, జాతీయ పార్టీగా అవతరించడం ఒక చారిత్రక అవసరమనే విషయాన్ని పార్టీ శ్రేణులకు కేసీఆర్ వివరించనున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల కోసం పార్టీ యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేసేలా మీటింగ్ నిర్వహించాలని నేతలకు కేసీఆర్ సూచించినట్లు సమాచారం. అన్నివర్గాల అభిమానాన్ని చూరగొన్న బీఆర్ఎస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని భరోసా నింపనున్నట్లు తెలిసింది. కాగా, కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయాలను జనరల్ బాడీ మీటింగ్ వేదికగా ప్రకటిస్తారనే దానిపై పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొన్నది.

Read more :

గవర్నర్ తిరస్కరించిన బిల్లులపై సర్కార్ కీలక నిర్ణయం.. ఈసారి ఓకే చెప్పక తప్పదా!

Advertisement

Next Story

Most Viewed