BJP MLA: కాంగ్రెస్ స‌మ‌ర్థించడం ముమ్మాటికీ దేశ‌ ద్రోహ‌మే

by Gantepaka Srikanth |
BJP MLA: కాంగ్రెస్ స‌మ‌ర్థించడం ముమ్మాటికీ దేశ‌ ద్రోహ‌మే
X

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశీ హిండెన్‌బర్గ్‌ను కాంగ్రెస్ స‌మ‌ర్థించడం ముమ్మాటికీ దేశ‌ద్రోహ‌మేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. పార్లమెంటులో ప్రతిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విదేశీ సంస్థ హిండెన్‌బర్గ్‌కు మౌత్ పీసుగా మారిందని, ఇది ఆ పార్టీ దివాళాకోరు రాజకీయాల‌కు నిద‌ర్శనమని ఏలేటి గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. భార‌త ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న అమెరికన్‌ షార్ట్‌ సెల్లింగ్‌, మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సెబీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ క‌మిటీ వేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క, మంత్రులు డిమాండ్ చేయ‌డం దేశ ప్రయోజ‌నాల‌కు వ్యతిరేకమని విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక ప్రయోజ‌నాల‌కు విఘాతం క‌లిగేలా వ్యవ‌హ‌రిస్తున్న విదేశీ కంపెనీ హిండెన్‌బర్గ్‌కు వ‌త్తాసు ప‌లుకుతున్నందుకు కాంగ్రెస్ పెద్దలంతా ఓసారి ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలని చురకలంటించారు.

హిండెన్‌ బర్గ్‌ భార‌త ఆర్థిక వ్యవస్థను అస్థిర‌ప‌ర‌చాల‌ని చూస్తోందన్నారు. గతేడాది కూడా హిండెన్ బ‌ర్గ్ ఇప్పటిలాగే భార‌త ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసుకుని ఓ నివేదిక‌ను విడుద‌ల చేసిందని ఆయన పేర్కొన్నారు. దాని ఆధారంగా కాంగ్రెస్ అప్పట్లో కూడా రాజ‌కీయం చేయాల‌ని చూసి భంగ‌ప‌డిందన్నారు. అయినా కాంగ్రెస్ పెద్దల బుద్ధి మార‌లేదని, ఇపుడు తాజ‌గా హిండెన్‌బర్గ్ కంపెనీ, భార‌త ఆర్థిక రంగంలో కీల‌క సంస్థ అయిన‌ సెబీపై ఇచ్చిన నివేదిక ఆధారంగా మ‌రోసారి రాజ‌కీయం చేయడం విదేశీ శ‌క్తుల కుట్రల‌కు వ‌త్తాసు ప‌ల‌క‌డ‌మేనని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ నాయ‌క‌త్వంలో పురోగ‌మిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిర‌ ప‌ర‌చాల‌ని విదేశీ శ‌క్తులు కొన్నేళ్లుగా ప‌నిచేస్తున్నాయన్నారు. ఆ కోవ‌కు చెందిందే హిండెన్‌బర్గ్‌ అని ఏలేటి తెలిపారు. ఓ అమెరికా కంపెనీ ఇచ్చిన నివేదిక‌కు కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశవ్యాప్తంగా రాజ‌కీయం చేస్తోందంటే, అస‌లు ఆ నివేదిక రూప‌క‌ల్పనకు స‌హ‌క‌రించిందే హ‌స్తం పార్టీ అనే అనుమానాలు వ‌స్తున్నాయన్నారు.

కాంగ్రెస్ సహకారం లేకుండా అమెరికా కంపెనీ హిండెన్‌బర్గ్‌ భారత ఆర్థిక వ్యవస్థపై నివేదికను రూపొందించలేదనేది నిపుణుల మాట‌గా ఆయన చెప్పుకొచ్చారు. సెబీ సంస్థపై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక ఏవిధంగా ప్రామాణికమో దేశ ప్రజలకు కాంగ్రెస్ వివరించాలన్నారు. విదేశీయురాలైన సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఇండియ‌న్ హెరాల్డ్ కేసులో బెయిల్ పై బయట తిరుగుతున్నారని ఏలేటి తెలిపారు. ప‌దేళ్లకు పైగా అధికారానికి దూర‌మైన గాంధీ కుటుంబానికి ఇక క‌నుచూపు మేర‌లో అధికారం వ‌స్తుంద‌న్న న‌మ్మకం లేక‌పోవ‌డంతోనే ప్రధాని మోడీపై ఉన్న గుడ్డి వ్యతిరేకతతో ఇలా హిండెన్ బ‌ర్గ్ వంటి విదేశీ సంస్థలను న‌మ్ముకున్నారని చురకలంటించారు. కాంగ్రెస్.. విదేశీ శ‌క్తుల‌కు ఏజెంట్ గా మారిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed