BIG News: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. దసరా కానుకగా రెండు డీఏలు

by Shiva |
BIG News: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. దసరా కానుకగా రెండు డీఏలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగులకు దసరా కానుకను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ (కరువు భత్యం)లలో రెండింటిని క్లియర్ చేయాలనుకుంటోంది. నవంబరు 1న అందుకోబోయే అక్టోబర్ జీతంతోనే ఈ రెండు డీఏల అమౌంట్‌ను కూడా కలిపి ఇవ్వాలనే చర్చలు సెక్రటేరియట్‌లో జరుగుతున్నాయి. ఆర్థిక శాఖ కూడా ఈ మేరకు కసరత్తు చేస్తున్నది. ఒక్కో డీఏకు ఎంత భారం పడుతుందని, రెండింటికి కలిపి అదనంగా ఎంత కేటాయించాల్సి వస్తుందనే లెక్కలు ఆఫీసర్లు వేస్తున్నారు. గత ప్రభుత్వంలో 2022 జూలై నుంచి డీఏ (కరువు భత్యం)లు పెండింగ్‌లో పడ్డాయి. ఐదో డీఏ కూడా రాబోతున్నందున ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వనరుల లభ్యత మేరకు కనీసంగా రెండింటిని విడుదల చేయాలనే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం చర్చించుకుని నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

సీఎం, డిప్యూటీ సీఎంలను వేర్వేరు సందర్భాల్లో కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయడమే కాకుండా నాలుగు పెండింగ్ డీఏల గురించి కూడా ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు నెల జీతం ఎప్పుడొస్తుందో తెలియని అయోమయ పరిస్థితులను మానవతా దృక్పథంతో అర్థం చేసుకున్న రాష్ట్ర సర్కారు మార్చి నెల నుంచి క్రమం తప్పకుండా పేమెంట్ చేయాలని నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా ప్రతి నెలా ఫస్ట్ తారీఖునే జమ అవుతున్నది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఈ నిర్ణయం ప్రూవ్ చేయడమే కాకుండా ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉన్నదనే మెసేజ్‌ను పంపింది. దీనికి కొనసాగింపుగా ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రెండు డీఏలను (జూలై-డిసెంబరు 2022, జనవరి-జూన్ 2023) విడుదల చేయాలనుకుంటున్నది.

ప్రభుత్వంపై రూ.300 కోట్ల భారం

రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు ఉత్సాహంగా జరుపుకునే దసరా పండుగ కానుకగా ఈ ప్రకటన చేయాలని భావిస్తున్నది. జూలై-డిసెంబరు 2022, జనవరి-జూన్ 2023 డీఏలను 3.64 % చొప్పున గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ అమలు చేయకుండా పెండింగ్‌లో పెట్టడంతో ఇప్పుడు వాటికి మోక్షం కలిగించాలనుకుంటున్నది. బీఆర్ఎస్ సర్కారులో డీఏలకు నోచుకోలేకపోయిన ఉద్యోగులు కనీసం ఇప్పుడైనా సాకారమవుతుందేమోననే ఆశతో ఉన్నారు. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ప్రస్తావించారు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నందున సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని, తప్పకుండా సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. రెండు డీఏలను క్లియర్ చేస్తే ప్రభుత్వానికి అదనంగా రూ.300 కోట్ల చొప్పున భారం పడనున్నట్టు ఆర్థిక శాఖ ఆఫీసర్ల ప్రాథమిక అంచనా.

మరో రెండింటిపై డెసిషన్

ఇప్పటికే ఉద్యోగుల శాలరీలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్‌ల కోసం దాదాపు రూ.4,800 కోట్ల చొప్పున ప్రతి నెలా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రెండు డీఏలను క్లియర్ చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రెండింటిపై నిర్ణయం తీసుకునేలా ఆలోచిస్తున్నది. ప్రభుత్వ నిర్వహణలో ఉద్యోగుల పాత్రను గుర్తించిన ప్రభుత్వం ఈ దిశగా అధికారిక ప్రకటన చేయనున్నది. రైతులకు రెండు లక్షల రుణమాఫీని రూ.8 వేల కోట్ల మేర ఒకే నెల వ్యవధిలో సంపూర్ణంగా అమలు చేసిన ప్రభుత్వానికి ఉద్యోగులకు రెండు డీఏలను ఇవ్వడంలో కష్టమేమీ కాదన్న సందేశాన్ని ఉద్యోగులకు ఇవ్వాలనుకుంటున్నది. ఈ రెండింటిని క్లియర్ చేస్తే ఇంకా జూలై-డిసెంబరు 2023, జనవరి-జూన్ 2024 పెండింగ్‌లో ఉంటాయి. మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించగానే రాష్ట్ర సర్కారు కూడా అదే లైన్‌లో అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది ఐదో డీఏ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed