BIG News: అశావహులకు గుడ్ న్యూస్.. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!

by Shiva |
BIG News: అశావహులకు గుడ్ న్యూస్.. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీలు జరగనున్నాయి. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి ఈ నెల 15 తర్వాత ఎన్నికల నగారా మోగనున్నది. అందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్​శాఖ, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. పోలింగ్​ కేంద్రాలు ఖరారు చేయడం, పార్టీలకు గుర్తులు, ఇండిపెండెంట్​అభ్యర్థుల గుర్తులు, ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్​ఆఫీసర్లను ఖరారు చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం అన్నింటికి సంబంధించిన ఆదేశాలు చకచకా జారీ అయ్యాయి. ఈ నెల మూడో వారంలోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ్రీ సింబల్స్ ప్రకటన

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల సింబల్స్‌తో పాటుగా మరో 30 ఫ్రీ సింబల్స్‌ను కేటాయించింది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసే వారు ఈ గుర్తుల్లో వేటినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఒకే గుర్తును ఇద్దరు ఎంపిక చేసుకుంటే డ్రా విధానంలో ఎంపిక చేస్తారు. కాంగ్రెస్‌కు (చేయి గుర్తు), బీజేపీ (కమలం పువ్వు), ఆమ్ ఆద్మీ(చీపురు), సీపీఎం (సుత్తి కొడవలి నక్షత్రం) పార్టీలు గుర్తింపు పొందిన కేటగిరిలో ఉండగా.. ఎంఐఎంకు పతంగి, బీఆర్ఎస్‌కు కారు, టీడీపీకి సైకిల్, వైఎస్ఆర్​సీపీకి ఫ్యాన్​గుర్తులు కేటాయించారు. రిజిస్టర్డ్​పార్టీల గుర్తుల్లో జనసేకు గాజు గ్లాసు, సీపీఐకి కంకి కొడవలి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్​పార్టీకి సింహం గుర్తులు ఉన్నాయి. రాష్ట్రంలో రిజిస్టర్డ్​పార్టీలుగా నమోదు అయి సింబల్​కేటాయించని పార్టీలు 66 ఉన్నాయి.

ఫ్రీ సింబల్స్​ఇవే..

ఎయిర్ కండిషనర్, ఆపిల్, పండ్ల బుట్ట, బెల్ట్, బైనాక్యులర్స్, కెమెరా, క్యారమ్​బోర్డు, చపాతీ రోలర్, కోటు, ఫుట్‌బాల్ ఆటగాడు ఇలా మొత్తం 30 ఫ్రీ సింబల్స్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది.

15 లోపు ఆర్‌వోలకు శిక్షణ

ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్​అధికారులు, పోలింగ్​సిబ్బందిని ఈనెల 10వ తేదీలోపు ఖరారు చేయాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీరికి శిక్షణ ఇచ్చేందుకు టీవోటీ(ట్రైనర్స్​ఆఫ్​ట్రైనీస్)లు, మాస్టర్​ట్రైనీస్​లకు శిక్షణ పూర్తి చేసింది. జిల్లాల్లోని రిటర్నింగ్ అధికారులకు వీరు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత అసిస్టెంట్​రిటర్నింగ్​అధికారులకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ నెల 12లోపు రిటర్నింగ్​అధికారులకు, 15 లోపు పీవోలు, ఏపీవోలకు శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

15లోపు పోలింగ్​ కేంద్రాలు ఫైనల్

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఈ నెల 15 కల్లా పోలింగ్​కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు పోలింగ్​కేంద్రాల ఖరారుకు సంబంధించిన షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. పోలింగ్​కేంద్రాల జాబితాను స్వయంగా మండల స్థాయి అధికారులు పరిశీలించి ఆ భవనాలు ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉంటాయో లేదో పరిశీలించాలని సూచించింది. ఆ తర్వాత ముసాయిదా జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది.

పోలింగ్​ కేంద్రాల షెడ్యూల్​.. - తేదీ

––––––––––––––––––––––––––––––-----

పోలింగ్​ కేంద్రాల ముసాయిదా ప్రకటన - ఈ నెల 11

పోలింగ్​కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణ - ఈ నెల 11 నుంచి 13 వరకు

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం - ఈ నెల 13

పోలింగ్​కేంద్రాలపై అభ్యంతరాలను పరిష్కరించడం - ఈ నెల 14

పోలింగ్​కేంద్రాలకు కలెక్టర్​ల ఆమోదం - ఈ నెల 14

పోలింగ్​కేంద్రాల తుది ప్రకటన - ఈ నెల 15

Next Story

Most Viewed