BIG BREAKING: మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా‌రెడ్డి అస్తమయం

by Shiva |   ( Updated:2024-09-06 05:19:34.0  )
BIG BREAKING: మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా‌రెడ్డి అస్తమయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడంలో ఆయన పాత్ర అనన్యసామాన్యం. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే నాయకుడు ఆకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు, ఆయన అనుచరులు, అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి అన్ని తానై వ్యవహరించిన జిట్టా.. స్వరాష్ట్ర కాంక్షలు రగిల్చి ప్రజల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్లారు. ఫ్లోరైడ్‌‌ సమస్యతో కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్న వారిని చూడలేక ఆయన సొంత ఖర్చుతో గ్రామాల్లో నెలకొల్పిన ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నేటికి మనుగడలో ఉన్నాయంటే అది ఆయన కృషే. కాగా, జిట్టా బాలకృష్ణా‌రెడ్డి అంత్య్రక్రియలు భువనగిరి శివారులోని మగ్దుంపల్లి రోడ్డులో గల ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లుగా ఆయన సంబంధీకులు తెలిపారు.

కాగా, జిట్టా బాలకృష్ణా‌రెడ్డి 14 డిసెంబర్ 1972న యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 1987లో బీబీనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. 1993లో ఎల్‌బీ నగర్‌లోని డీవీఎం డిగ్రీ & పీజీ కళాశాల గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన ఆయన టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కొన్నాళ్ల పాటు పని చేశాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమితో పొత్తులో భాగంగా భువనగిరి అసెంబ్లీ సీటు టీడీపీకి వెళ్లడంతో ఆకయన టీఆర్ఎస్ పార్టీని వీడారు. అనంతరం అదే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఆ తరువాత పరిణామాలతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్సార్ హఠాన్మరణం తరువాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అయితే, రాష్ట్ర విభజన సమయంలో జగన్ లోక్‌సభలో తెలంగాణ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి ‘యువ తెలంగాణ’ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 2022లో బీజేపీలో చేరి‌ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇటీవలే, 2023 అక్టోబర్ 20న తిరిగి జిట్టా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

Advertisement

Next Story