సింగరేణి గనుల వేలం ఆపాలి.. కచ్చితంగా వేలం వేయాలని చట్టంలో లేదు: కోదండరామ్

by Ramesh N |   ( Updated:2024-06-24 10:05:51.0  )
సింగరేణి గనుల వేలం ఆపాలి..  కచ్చితంగా వేలం వేయాలని చట్టంలో లేదు: కోదండరామ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయ అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఉత్తర తెలంగాణలో సింగరేణి ద్వారా అనేక మంది జీవితాలు బాగు పడ్డాయన్నారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీస్‌లో కొదండరామ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో బొగ్గు గనుల వేలం గురించి చర్చనడుస్తోందని చెప్పారు. 1973లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సర్కార్ పార్లమెంట్ చట్టం ద్వారా బొగ్గు గనులను జాతీయం చేశారని గుర్తుచేశారు. జాతీయం చేయడానికి వేసిన కమిటీలో అధికారి శంకరన్ సెక్రటరీగా ఉన్నారని, ఆ ఫైల్స్ శంకరన్ తనకు ఆయన చాలా సార్లు చూపించారని గుర్తుచేశారు.

పర్యావరణ విధ్వంసం, విపరీతమైన దోపిడీ, తక్కువ జీతాల కారణంగా ఆ రోజుల్లో అన్ని బొగ్గు గనులను జాతీయం చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. బొగ్గు గనులను మాఫీయా గ్యాంగులు నిర్వహిస్తూ ఉండేవని, వాటి నుంచి విముక్తి కలిగించే లక్ష్యంతోనే అప్పటి ప్రభుత్వం ఓ కమిషన్ వేసి జాతీయం చేసిందని స్పష్టంచేశారు. తర్వాత సరళికరణ యుగం మొదలైన తర్వాత 1989 నుంచి చాలా పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటు చేశారని, ఆ సమయంలోనే బొగ్గు గనులను కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పడం ప్రారంభం అయింది. విద్యుత్ ఉత్పత్తి చేసేవారికి గనులు అప్పజెప్పారని, ఈ క్రమంలోనే అక్రమాలు, అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయన్నారు.

సుప్రీం కోర్టు ఈ కేటాయింపులను విశ్లేషించిన తర్వాత గనులను కేటాయించే టప్పుడు వేలం పద్దతిని పాటించాలని, ఎవరూ బహిరంగ టెండర్ వేస్తే వారికే ఇవ్వాలని తీర్పు చెప్పిందన్నారు. ఆ తీర్పు ప్రకారం బొగ్గు గనులను వేలం వేయడానికి అవకాశం కల్పించారన్నారు. అది ప్రైవేటీకరణను నియంత్రించడానికి వచ్చిన చట్టమని చెప్పారు. ప్రైవేటీకరణ వల్ల కలిగే అక్రమాలు, అవినీతిని నిలువరించేందుకు వచ్చిన చట్టమని గుర్తుచేశారు. ఈ చట్టం వచ్చేనాటికి దేశంలో కోల్ ఇండియా, సింగరేణి ఉందన్నారు. అయితే, చట్టం గనులను కచ్చితంగా వేలం వేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదని స్పష్టంచేశారు. కేంద్రం బొగ్గు గనులను ప్రైవేటు చేస్తామంటే కుదరదన్నారు. తెలంగాణ అస్థిత్వాలు మరిచి నిర్ణయాలు చేయవద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. సింగరేణి గనులను వేలం ఆపాలని, వీలైతే మరిన్ని గనులను సింగరేణికి కేటాయించి, సింగరేణికే బొగ్గును తవ్వే అధికారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed