మహిళలపైనే ఆశలన్నీ.. వారిని ఆకర్షించేలా కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్

by Disha Web Desk 4 |
మహిళలపైనే ఆశలన్నీ.. వారిని ఆకర్షించేలా కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రత్యేక స్ట్రాటెజీని రూపొందించింది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉండడంతో వాటిని కన్సాలిడేట్ చేసుకోవడంపై దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు వర్తించే పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నది. ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా వారికి ఉచిత ప్రయాణం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ, మహిళా స్వయం సహాయక బృందాలకు సర్కారు స్కూలు విద్యార్థుల యూనిఫాం కుట్టేలా ఉపాధి కల్పన, ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందించడం.. ఇలాంటివన్నీ ఇంటింటికీ చేరేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించింది. కాంగ్రెస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు గ్రామాల్లో ఇప్పటికే విడివిడిగా ప్రచార క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారు.

మహిళలకు తొలి ప్రాధాన్యం

‘మహాలక్ష్మి’లోని స్కీముల అమలుతో వారి ఓటు బ్యాంకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఇటీవల ఆరు గ్యారెంటీల్లోని ఈ స్కీములపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఫ్రీ బస్ జర్నీ ఇచ్చామనే అంశాన్ని నొక్కిచెప్తున్నారు. వంద రోజుల్లోనే గ్యారెంటీలను అమలు చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ సోనియాగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టామని, మేనిఫెస్టోలో ప్రకటించినవన్నీ ఇకపైన ఒక్కటొక్కటిగా ప్రజలకు అందిస్తామని భరోసా కల్పించారు. ఇటీవల పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో సైతం మహిళలకు తొలి వరుసలోనే చోటు కల్పించడంతో పాటు అన్ని జిల్లాల నుంచి దాదాపు లక్ష మంది స్వయం సహాయ మహిళా బృందాల్లోని సభ్యులు హాజరయ్యేలా చొరవ తీసుకున్నారు.

మహిళలకు చేరువయ్యేలా

ఆ వేదికగానే వడ్డీలేని రుణాలను అందిస్తామని స్వయంగా సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. దీనికి తోడు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలను కుట్టిచ్చే పనులను కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకే అప్పగించేలా సర్కారు నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనలోనూ వారికి బాధ్యతలు అప్పగించేలా ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పేరుతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆయా పాఠశాలల్లోని సౌకర్యాలను మెరుగుపర్చడానికి ఏర్పడే కమిటీలో మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులతో పాటు విద్యార్థుల తల్లులకు కూడా చోటు కల్పించేలా విద్యాశాఖ ఇటీవల స్పష్టత ఇచ్చింది. పోల్ అయ్యే ఓట్లలో మహిళలవే ఎక్కువ ఉంటాయన్న గత ఎన్నికల అనుభవాలతో వారికి పార్టీని దగ్గర చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది.

రంగంలోకి అనుబంధ సంఘాలు

అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ నాయకత్వం నిర్దిష్టంగా ఎలాంటి టాస్క్ ఇవ్వకపోయినా ఈసారి మాత్రం వారిని కూడా ప్రచారంలోకి పంపిస్తున్నది. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి వంద రోజుల్లో అమలైన గ్యారెంటీలు, వాటి ఫలాలను వివరించడంతో పాటు నాలుగైదు నెలల పాలనలో ప్రభుత్వ సంక్షేమాన్ని కూడా అర్థం చేయించేలా ప్లానింగ్ ఇచ్చింది. మహిళా కాంగ్రెస్ శ్రేణులు కరపత్రాలు పంచుతూ మహిళలను ప్రభావితం చేస్తున్నారు. వారి ద్వారా కుటుంబంలోని ఓట్లను కూడా కాంగ్రెస్‌వైపు మళ్లించేలా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఒకవైపు ఎన్ఎస్‌యూఐ, మరోవైపు యూత్ కాంగ్రెస్, కిసాన్ సెల్, వికలాంగుల విభాగాల యాక్టివిస్టులు ప్రచారం చేస్తుండగా మహిళా కాంగ్రెస్ సైతం గ్రామాల్లో క్యాంపెయిన్‌ను యాక్టివ్ చేసింది.



Next Story

Most Viewed