Alert‌: యాదాద్రి భక్తులకు అలర్ట్.. డ్రెస్ కోడ్‌పై కీలక నిర్ణయం!

by Ramesh N |
Alert‌: యాదాద్రి భక్తులకు అలర్ట్.. డ్రెస్ కోడ్‌పై కీలక నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ పరిధిలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ మేరకు తాజాగా ఆలయ అధికారులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో (ఆర్జిత పూజలో పాల్గొనే భక్తులు) ఇకనుంచి సాంప్రదాయ దుస్తులు ధరించాలని నిబంధనలు విధించారు. ఆర్జిత సేవలు వినియోగించుకునే భక్తులు జూన్ 1వ తేదీ నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కావాలని వెల్లడించారు. అయితే, ధర్మ దర్శనం (ఉచిత) క్యూలైన్​లో వచ్చే భక్తులకు ఈ నియమం వర్తించదన్నారు. ఆర్థిక పూజల్లో పాల్గొనే భక్తులకు మాత్రమే డ్రెస్ కోడ్ (సంప్రదాయ దుస్తులు) తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆలయ ఈవో స్పష్టంచేశారు. యాదాద్రిలో ఈ నెల 20 న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 22 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. 20వ తేదీన ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవచనం, లక్ష కుంకుమార్చన పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరోవైపు ఆలయ పరిధిలో మరో నిబంధన అమలులోకి తెచ్చారు. యాదాద్రి దేవస్థానం పరిధిలో ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, వస్తువులు, కవర్లను నిషేధిస్తూ యాదాద్రి ఆలయ కార్యనిర్వహణాధికారి దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్‌ వస్తువుల స్థానముల్లో ప్లాస్టికేతర వస్తువులను మాత్రమే వాడాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story