బాసర అమ్మవారి క్షేత్రంపై నిర్లక్ష్యపు నీడలు... నిధులు ఇచ్చి తిరిగి వెనక్కి...!

by srinivas |
బాసర అమ్మవారి క్షేత్రంపై నిర్లక్ష్యపు నీడలు... నిధులు ఇచ్చి తిరిగి వెనక్కి...!
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోనే గోదావరి ప్రవేశద్వారం బాసర. బాసర జ్ఞాన సరస్వతీ దేవి పుట్టిల్లు. దక్షిణ భారతంలోని ఉన్న ఏకైక చదువుల తల్లి కొలువుదీరిన ప్రసిద్ధ క్షేత్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాల్లో బాసర పేరును అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందిపుచ్చుకుని ఉద్యమాన్ని రెట్టింపు చేశారు. అమ్మవారి క్షేత్రం అభివృద్ధి సహా బాసరలోనే ఐఐటి ఏర్పాటు విషయంలో కేసీఆర్ బాసరలో భారీ బహిరంగ సభను సైతం ఏర్పాటు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాసర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. బాసర మాస్టర్ ప్లాన్ పేరుతో 100 కోట్లతో అభివృద్ధి చేస్తామని, నిధులు సైతం విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో బాసర రూపురేఖలు మారుతాయని ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలు ఆశించారు కానీ ఆచరణలో అది అమలు కాకపోవడంతో బాసర అభివృద్ధిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

మాస్టర్ ప్లాన్ కోసం 100 కోట్లు...

బాసర సరస్వతి క్షేత్రం అభివృద్ధి కోసం వంద కోట్లు కేటాయిస్తూ అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది తెలంగాణలో ఉన్న యాదగిరిగుట్ట, వేములవాడ, కొండగట్టు సహా ఇతర ప్రముఖ దేవాలయాల అభివృద్ధిలో భాగంగా బాసర అమ్మవారి క్షేత్రాన్ని సైతం అభివృద్ధి చేసేందుకు అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో బాసర భారీగా అభివృద్ధి చెందుతుందని భక్తులతో పాటు జిల్లా వాసులు ఆశించారు ఈ నేపథ్యంలోనే బాసర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోవడంతో ఆ ప్రాంతంలో పెట్టుబడులు కూడా విపరీతంగా పెట్టారు. ఐఐటీ ఏర్పాటు స్థానంలో త్రిబుల్ ఐటీ ఏర్పాటు అయినప్పటికీ ఈ ప్రాంతం ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుందని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తుందని భక్తులు, ఈ ప్రాంత ప్రజలు భావించారు. జిల్లా ప్రముఖులతోపాటు హైదరాబాద్ సహా మహారాష్ట్ర ప్రాంత వాసులు ఈ ప్రాంతంలో ఖరీదైన స్థలాలు కూడా కొనుగోలు చేశారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఆలయ అభివృద్ధితోపాటు గోదావరి నది వద్ద ఏర్పాట్లు, రింగు రోడ్డు, బాసర రైల్వే స్టేషన్ వద్ద అభివృద్ధి పనులు, ఆలయ సమీపంలో పార్క్, ఇతర వసతులు, నూతన వసతి గృహాలు ఇలా అనేకంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినట్లు ప్రచారం జరిగింది.

50 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి...

బాసర మాస్టర్ ప్లాన్ కోసం 100 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వం జీవోను కూడా విడుదల చేసింది అప్పటి దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా వాసి కావడంతో బాసర మాస్టర్ ప్లాన్ సకాలంలో పూర్తి అవుతుందని ఆశించారు. 100 కోట్ల అభివృద్ధి నిధుల్లో భాగంగా ముందుగా 50 కోట్లు విడుదల చేస్తూ జీవో కూడా జారీ అయింది. ఆ నిధులను ఖర్చు చేసే విషయంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టే క్రమంలోనే నిధుల విడుదలపై సందిగ్ధం ఏర్పడింది. ఆ తర్వాత నిధుల విడుదలపై ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 50 కోట్ల నిధులు తిరిగి వెనక్కి మళ్లించారని అధికార వర్గాలు తేల్చేశాయి. దీంతో బాసర మాస్టర్ ప్లాన్ ఫైల్ పెండింగ్‌లో పడింది. ఇప్పట్లో పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు లేవని చెబుతున్నారు. మరో రెండేళ్ల వ్యవధిలో గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో బాసర మాస్టర్ ప్లాన్ పెండింగ్‌లో పడటం భక్తులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను నిరాశ పరుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed