గవర్నర్ దత్తత గ్రామానికి జిల్లా కలెక్టర్..

by Sumithra |
గవర్నర్ దత్తత గ్రామానికి జిల్లా కలెక్టర్..
X

దిశ, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఆదిలాబాద్ రూరల్ మండలంలో దత్తత తీసుకున్న బుర్కి గ్రామాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించి పరిశీలించారు. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు దుప్పట్లు, విద్యార్ధులకు యూనిఫాంలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి ఖుష్బూ గుప్తాతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో బుర్కి గ్రామానికి చేరుకున్న జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తలకు గ్రామస్తులు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ, డీడబ్ల్యుఓ, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ, ఫారెస్ట్, ఆర్ డబ్లూ ఎస్, వ్యవసాయ శాఖ ఏఓ, వివిధ ఆయా శాఖల అధికారులు, ఎంపీడీఒ, ఎంపీఓ తదితరులు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల తీరును కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో అన్ని మౌలిక వసతులు, అభివృద్ధికి కృషి చేస్తారని, ఈ గ్రామంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారని, అంగన్వాడి భవనం, కమ్యూనిటీ హాల్ నూతనంగా నిర్మించారన్నారు.

రహదారి నిర్మాణానికి అంకోలీ నుండి భుర్కి గ్రామానికి 6 కిలో మీటర్లు ఉంటుందని, రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, ముందుగా రెవెన్యూకు సంబంధించి 1.6 కిలో మీటర్లు బిటి రోడ్డు నిర్మాణం, తదుపరి అటవీ శాఖ అనుమతులతో మిగితా రోడ్డు నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ నిర్మాణ పనులు మార్చి చివరిలోగా పూర్తి చేయాలని ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ ను ఆదేశించారు.

ఓపెన్ వెల్ కు రిటర్నింగ్ వాల్ ఏప్రిల్ 7 వరకు పూర్తి చేయాలని ఆర్ డబ్లు ఎస్ ను ఆదేశించారు. అదేవిధంగా సోలార్ ద్వారా నీటి సదుపాయం కల్పించడానికి సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రెడ్ సీ సంస్థ ముందుకు వచ్చిందని అన్నారు. ఐటీడీఏ ద్వారా 20 మందికి డీజిల్ ఇంజన్, స్ప్రింక్లర్లు, ట్రాక్టర్, క్రషర్ ఏర్పాటు చేస్తారని, ఐటీడీఎ పీఓ తెలిపారు. అంగన్వాడి ద్వారా పోషకాహారం అందించడం, అంగన్వాడి టీచర్, సీఆర్టీ తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని సూచించారు. మారుమూల గిరిజనుల నివాసమైన బుర్కి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకొని ప్రణాళిక ప్రకారం గిరిజనులకు పోషకమైన ఆహారాన్ని అందించడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) సభ్యులు పని చేస్తున్నారని తెలిపారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు శాతాన్ని, పౌష్టికాహారం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద సోనేరావు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed