Congress : ముధోల్ కాంగ్రెస్ లో నామినేటెడ్ రగడ..!

by Sumithra |
Congress : ముధోల్ కాంగ్రెస్ లో నామినేటెడ్ రగడ..!
X

దిశ, ప్రతినిధి నిర్మల్ : నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకం ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ లో రగడకు దారి తీస్తున్నది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన కార్యకర్తలకు అవకాశం ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు డైరెక్టర్ల పదవులు ఇవ్వడం పై ఆ నియోజక వర్గ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు నారాయణ రావు పటేల్ వర్గీయులు ఫిర్యాదు చేయడంతో పార్టీలో నెలకొన్న విభేదాలు తెరకెక్కాయి. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతూ, చిత్తశుద్ధితో అంకితభావంతో పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నారాయణరావు పటేల్ రాసిన లేఖను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రికి అందజేసిన ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి పార్టీ సీనియర్ నేత ఆనంద్ రావ్ పటేల్ కు అవకాశం ఇచ్చారు. అయితే వైస్ చైర్మన్, కొందరు డైరెక్టర్లు ఎన్నికల్లో ఇతర పార్టీలకు పనిచేశారని, వారికి ఎట్లా పదవులు ఇస్తారని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన కొద్ది రోజులు వ్యవధిలోనే కొత్తవారికి అవకాశం ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ప్రస్తుతం బాసర ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు, కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ ల పదవులు, ఆత్మ చైర్మన్ తో పాటు ఇతర పదవులు కష్టపడ్డ కార్యకర్తలకు ఇవ్వాలని వారు విన్నవించారు. ఇటీవల పార్టీలో చేరిన వారి పై, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సహా ఆయన వర్గీయుల పై సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మంత్రి సీతక్కను కలిసిన వారిలో మాజీ ఎంపీపీ రామచంద్రారెడ్డి, బాసర మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్, ప్రేమ్ నాథ్ రెడ్డి, బెజ్జంకి ముత్యం రెడ్డి, కుబీర్ మండల కాంగ్రెస్ నాయకులు రమేష్ ఉన్నారు. ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed