నెరవేరనున్న కల!.. రోడ్డు వెడల్పునకు సంబంధించిన పనులకు శ్రీకారం

by Kavitha |
నెరవేరనున్న కల!.. రోడ్డు వెడల్పునకు సంబంధించిన పనులకు శ్రీకారం
X

దిశ, వేములవాడ : ఎములాడ రాజన్న భక్తుల, పట్టణ ప్రజల ఎన్నో ఏళ్ల నాటి కల త్వరలోనే నెరవేరనుంది. వీరికి ఇక ట్రాఫిక్ కష్టాలు దూరం కానున్నాయి. అందులో భాగంగా మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి ఆలయం వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును 80 ఫీట్ల వెడల్పు చేసే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ కృషితో విస్తరణ పనులకు మోక్షం లభించింది. భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. శనివారం తెలంగాణ ప్రభుత్వం, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం నుండి భూ సేకరణ నిమిత్తం ప్రకటన విడుదలైంది.

ఆలయం, పట్టణం సమగ్ర అభివృద్ధి..

ఓ వైపు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 50 కోట్లు మంజూరు చేసిందని, ఇప్పుడు రోడ్డు వెడల్పు పనులకు ప్రకటన విడుదల కావడంతో ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంతో పాటు ఆలయం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ నాయకులు చేయలేని పనులను గెలిచిన అతి కొద్ది రోజుల్లోనే ఆది శ్రీనివాస్ చేస్తున్నారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

స్పష్టమైన ప్రణాళికతో అభివృద్ధి వైపు అడుగులు..

కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక పక్క ఆచరణతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శనాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. ఇది విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే భక్తుల ప్రీతిపాత్రమైన మొక్కు కోడె మొక్కుకు వినియోగించే కోడెల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిపై ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి కోడెల సంరక్షణకు మూడు షెడ్లు నిర్మింప చేశారు. గోశాలలో సీసీ నిర్మాణం, అలాగే డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గోవులకు పచ్చ గడ్డి, దాణా అందిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న కోడెలను అర్హులైన రైతులకు ఇప్పటికే అందజేశారు. అలాగే భక్తులకు తిరుమల తరహాలో నిత్యాన్నదానం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ప్రకటించగా, దానికోసం ఆలయం సమీపంలోని శివార్చన స్టేజి వద్ద సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. దానికోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇలా ఒక్కో పనిని స్పష్టమైన ప్రణాళికతో ఆచరణలో పెడుతూ ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.

దూరం కానున్న ట్రాఫిక్ కష్టాలు..

రాజన్న ఆలయానికి ఏటా భక్తుల రద్దీ పెరుగుతుంది. దానికి అనుగుణంగా పట్టణంలో రోడ్డు విస్తరణ లేకపోవడంతో వాహనదారులు, భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి రోడ్డు వెడల్పు అనేది తప్పనిసరి అయింది. ఈ క్రమంలోనే పట్టణవాసులు, వాహనదారులు, రాజన్న భక్తులు తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం వరకు వేగంగా చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి . అయితే మరికొద్ది రోజుల్లో భక్తులకు, పట్టణ ప్రజలకు మార్గం సుగమం కానుంది. రోడ్డు వెడల్పు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

సమగ్ర ప్రణాళికతో ముందుకు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయం, పట్టణ సమగ్ర అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించి ముందుకు వెళతాం. రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ ఆలయంగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు స్వామివారి దర్శనం వేగంగా కల్పించేందుకు, మెరుగైన వసతి, ఆహ్లాదకర వాతావరణం కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. ఆలయ అభివృద్ధి పనులను శృంగేరి పీఠం, పండితులు, భక్తుల సూచనల మేరకు చేపట్టి ముందుకు వెళతాం. గతంలో శృంగేరి పీఠాన్నీ సందర్శించినప్పుడు ఆలయ విస్తరణ నమూనాతో రావాలని వారు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ విస్తరణ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో త్వరలో శృంగేరి పీఠాన్ని సందర్శించి ఆలయ విస్తరణ పై నమూనాలను పీఠాధిపతి ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామివారిని కలిసి వారి సూచనలు సలహాల ప్రకారం ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విస్తరణ చేపడుతాం. ఆధ్యాత్మికత ఉట్టి పడేలా ఆలయాన్ని విస్తరిస్తాం. పట్టణ ప్రజలకు ఎవరికీ అన్యాయం జరగకుండా అభివృద్ధి పనులు కొనసాగిస్తాం.

Advertisement

Next Story

Most Viewed