హిందూ సమాజమే ముఖ్యం : విశ్వ హిందూ పరిషత్

by M.Rajitha |
హిందూ సమాజమే ముఖ్యం : విశ్వ హిందూ పరిషత్
X

దిశ, తెలంగాణ బ్యూరో : విశ్వహిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయ్యాయని.. ఈ సందర్భంగా షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి, రాష్ట్ర ప్రచార ప్రముఖ పగుడాకుల బాలస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1964లో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ముంబై సమీపంలోని సాందీపని ఆశ్రమంలో విశ్వహిందూ పరిషత్ ను స్థాపించారని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ సెకండ్ చీఫ్ గురూజీ స్థాపించిన తమ సంఘం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, చరిత్రలో నిలిచిపోయే అయోధ్య వంటి భారీ ఉద్యమాలు చేపట్టి విజయం సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. 1964 నుంచి 2024 వరకు ఆరు దశాబ్దాల కాలంలో తమ సంస్థ హిందూ సమాజ హితం కోసం పనిచేస్తూ వస్తోందని వివరించారు. ఈమేరకు శుక్రవారం విశ్వహిందూ పరిషత్ నేతలు నరసింహమూర్తి, బాలస్వామి పత్రిక ప్రకటన విడుదల చేశారు. 2024 శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ఈనెల 24 నుంచి సెప్టెంబర్ 1వ తారీకు వరకు వారం రోజులపాటు విశ్వహిందూ పరిషత్ షష్టి పూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలలో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల, ఆపై స్థాయి కేంద్రాలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయా కేంద్రాల్లో భారీ కార్యక్రమాలు రూపకల్పన చేసి, వారం పాటు హిందూ బంధువులందరినీ సంఘటితం చేసేందుకు సమ్మేళనాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా హిందూ బంధువులందరూ రాజకీయాలకు అతీతంగా విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed