భర్త వివాహేతర సంబంధం.. అనుమానస్పదంగా భార్య మృతి

by Bhoopathi Nagaiah |
భర్త వివాహేతర సంబంధం.. అనుమానస్పదంగా భార్య మృతి
X

దిశ, శాలిగౌరారం : భర్తకు వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య అర్థరాత్రి అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను శాలిగౌరారం ఎస్ఐ సైదులు ఆదివారం విలేఖరులకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం..

ఆకారం గ్రామానికి చెందిన సూరారపు రాజుకు నార్కెట్‌పల్లి మండలం అమ్మనబోల్ గ్రామానికి చెందిన మాతంగి కరుణ (24)తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సూరారపు రాజు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్య కరుణను నిత్యం వేధించే వాడు. దీంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా పద్ధతి మార్చుకోవాలని రాజును హెచ్చరించారు. అయినప్పటికీ రాజులో ఎలాంటి మార్పు రాకపోగా వేరే యువతిని వివాహం చేసుకుంటానని కరుణను నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. దాంతో భార్యభర్తల మధ్య గొడవలు తీవ్రతరం అయ్యాయి.

శనివారం తెల్లవారుజామున కరుణ నిద్ర మాత్రలు మింగి చనిపోయినట్లు ఆమె తండ్రి మాతంగి నర్సయ్యకు రాజు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే వచ్చిన తల్లిదండ్రులు కరుణ మృతదేహాన్ని పరిశీలించగా ఆమె మెడ, ఛాతి భాగాలు కమిలిపోయి ఉండటం గమనించారు. వివాహేతర సంబంధంతోనే తమ కూతురును రాజు, కుటుంబ సభ్యులు కలిసి హత్య చేశారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ సైదులు తెలిపారు.

Next Story

Most Viewed