కరోనా అంతానికి దేవుడిని ప్రార్థించమని.. అస్తమించిన టాంజానియా అధ్యక్షుడు

by vinod kumar |
Tanzanias President John Magufuli
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతానికి దైవాన్ని ప్రార్థించాలని ప్రజలను కోరిన టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి టాంజానియాలోని దార్ ఎస్ సలామ్ లోని ఒక ప్రైవేట్ ఆస్ప్రతిలో ఆయన కన్నుమూసినట్టు దేశ ఉపాధ్యక్షురాలు సమియ సులుహు హసన్ తెలిపారు.

దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆమె.. ‘దేశాధ్యక్షుడు జాన్ మగుఫులి గడిచిన పదేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో పోరాడుతున్నారు. బుధవారం రాత్రి ఆయన కన్నుమూశారు’ అని తెలిపారు. ఈ సందర్భంగా 14 రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని కోరారు.

జాన్ మృతితో తదుపరి అధ్యక్ష స్థానాన్ని సులుహు అధిరోహించనున్నారు. కాగా ఏసుక్రీస్తు ఆరాధకుడైన జాన్.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ‘ఈ దేశం నుంచి కరోనా వైరస్‌ను పారదోలేందుకు అందరూ దేవుడిని ప్రార్థించండి. ఈ దుష్ట వైరస్ (కరోనా) ఏసుక్రీస్తు బాడీలో నివసించజాలదు..’ అంటూ వ్యాఖ్యానించారు. టాంజానియాలో కేసుల పెరుగుదలకు కారణం టెస్ట్ కిట్‌లు సరిగా పనిచేయకపోవడమే అంటూ వైద్య సిబ్బందిపై దుమ్మెత్తి పోశారు. జాన్ మగుఫులి మరణంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతాపం వ్యక్తం చేశారు. 2015 నుంచి టాంజానియా అధ్యక్షుడిగా ఉన్న జాన్.. దేశంలో అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాడనే పేరు సంపాదించుకున్నారు. ప్రతి ఆదివారం ఆయన దేశంలోని ఏదో ఒక చర్చికి వెళ్లి అక్కడి ప్రజలతో ముచ్చటించేవారు.

Advertisement

Next Story