చైనా చేతిలో భారత్ ఓటమి.. క్వార్టర్స్ బెర్త్‌కు ఎలాంటి ఢోకా లేదు

by Dishanational3 |
చైనా చేతిలో భారత్ ఓటమి.. క్వార్టర్స్ బెర్త్‌కు ఎలాంటి ఢోకా లేదు
X

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల జట్టు తొలి ఓటమిని పొందింది. మంగళవారం జరిగిన గ్రూపు-ఏ చివరి మ్యాచ్‌లో ఆతిథ్య చైనా చేతిలో 5-0 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో బలమైన చైనా స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా.. యువ క్రీడాకారిణులతో కూడిన భారత జట్టు తడబడింది. ఒక్క గేమ్‌ కూడా గెలవలేకపోయింది. తొలి గేమ్‌లో ఇషారాణి 12-21, 10-21 తేడాతో చెన్ యు ఫీ చేతిలో ఓడటంతో భారత్ పతనం మొదలైంది. ఆ తర్వాత ప్రియ-శ్రుతి జోడీ 13-21, 12-21 తేడాతో చెన్ క్వింగ్ చెన్-జియా యి ఫ్యాన్ జంట చేతిలో డబుల్స్ మ్యాచ్‌ను కోల్పోయింది.

మరో సింగిల్స్ మ్యాచ్‌లో అన్బోల్ ఖర్బ్ రెండో గేమ్ మధ్యలో ఆట నుంచి వైదొలిగింది. దీంతో హన్ యూ 21-9, 4-1 తేడాతో గేమ్‌ను దక్కించుకోవడంతో చైనా 3-0తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇక, నామమాత్రపు మ్యాచ్‌ల్లో సిమ్రాన్-రితికి జోడీ, తన్వీ శర్మ కూడా తేలిపోవడంతో చైనా చేతిలో భారత్ వైట్‌వాష్ అయ్యింది. అయితే, ఈ ఓటమి భారత్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌పై ఎలాంటి ప్రభావం చూపించదు. భారత్ ఇప్పటికే క్వార్టర్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. గ్రూపు-ఏలో చైనా మూడు విజయాలతో అగ్రస్థానంలో నిలువగా.. రెండు విజయాలతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ప్రతి గ్రూపు నుంచి టాప్-2 జట్లు క్వార్టర్స్‌కు చేరుకుంటాయి.

Next Story

Most Viewed