రెజ్లర్లకు భద్రతను తొలగించిన ఢిల్లీ పోలీసులు.. పునరుద్ధరించాలని కోర్టు ఆదేశాలు

by Harish |   ( Updated:2024-08-23 14:41:44.0  )
రెజ్లర్లకు భద్రతను తొలగించిన ఢిల్లీ పోలీసులు.. పునరుద్ధరించాలని కోర్టు ఆదేశాలు
X

దిశ, స్పోర్ట్స్ : భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ గతేడాది స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాతోపాటు పలువురు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదవ్వగా.. ఢిల్లీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి రెజ్లర్లలో ఒకరు కోర్టులో శుక్రవారం వాంగ్మూలం ఇవ్వనున్నారు. అయితే, కోర్టులో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వనున్న మహిళా రెజ్లర్లకు కేటాయించిన భద్రతను ఢిల్లీ పోలీసులు ఉపసంహరించుకున్నారని వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు.. భద్రతను పునరుద్ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.అలాగే, భద్రతను ఉపసంహరించుకోవడానికి గల కారణాలను అందజేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. రెజ్లర్లకు భద్రత తొలగింపు వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. సెక్యూరిటీ తొలగించలేదని చెప్పారు. ‘భవిష్యత్తులో భద్రతా బాధ్యతలను హర్యానా పోలీసులకు కేటాయించాలని అభ్యర్థించాం. దీనిని ఢిల్లీ పోలీసు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే, రిపోర్టు చేయడానికి ఆలస్యమైంది. పరిస్థితిని చక్కదిద్దాం. భద్రత కొనసాగుతుంది.’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed