Ashwini Vaishnaw: రైలు చార్జీలు భారత్‌లోనే తక్కువ.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

by vinod kumar |
Ashwini Vaishnaw:  రైలు చార్జీలు భారత్‌లోనే తక్కువ.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత రైల్వేల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందని, రైల్వేలను అభివృద్ధి చేయడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) సోమవారం రాజ్యసభకు తెలియజేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొవిడ్ సంబంధిత సవాళ్లను రైల్వే వ్యవస్థ అధిగమించిందని, నష్టాలను తిరిగి పొందిందని తెలిపారు. ప్రజలు రైళ్లలో ప్రయాణించడానికి తిరిగి ఆసక్తి చూపుతున్నారని, ప్రయాణీకుల సర్వీసుతో పాటు కార్గో ట్రాఫిక్ సైతం అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని చెప్పారు. రైల్వేలు ప్రయాణీకుల చార్జీలను తగ్గిస్తూనే, కార్గో, సరుకు రవాణా కార్యకలాపాల నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని తెలిపారు.

పొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లోనే రైలు చార్జీలు అత్యంత తక్కువగా ఉన్నాయని నొక్కి చెప్పారు. ‘350 కిలోమీటర్ల ప్రయాణాన్ని పరిశీలిస్తే భారతదేశంలో జనరల్ క్లాస్ చార్జీ రూ. 121గా ఉంది. కానీ పాకిస్తాన్‌లో రూ. 400, శ్రీలంకలో రూ. 413. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది’ అని తెలిపారు. 2020 నుంచి రైలు చార్జీలు ఏ మాత్రం మారలేదన్నారు. ఇంధన ధరలు పెరిగినప్పటికీ చార్జీలు పెంచలేదని, కార్గో ఆదాయంతో దానిని భర్తీ చేయడానికి ప్రయత్నించామన్నారు. కొవిడ్ సంక్షోభం నుంచి రైల్వేలు దాదాపుగా కోలుకున్నాయని తెలిపారు. మార్చి 31 నాటికి భారత రైల్వేలు 1.6 బిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో ప్రపంచంలోని మొదటి మూడు దేశాలలో ఒకటిగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story