గాయాలను లెక్కచేయని నీరజ్.. డైమండ్ లీగ్ ఫైనల్‌లో విరిగిన చేతితోనే బరిలోకి

by Harish |   ( Updated:2024-09-15 12:58:54.0  )
గాయాలను లెక్కచేయని నీరజ్.. డైమండ్ లీగ్ ఫైనల్‌లో విరిగిన చేతితోనే బరిలోకి
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గాయాలను కూడా లెక్కచేయడం లేదు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో గజ్జలో గాయంతోనే పోటీపడిన అతను రజతం సాధించిన విషయం తెలిసిందే. బస్సెల్స్ వేదికగా శనివారం అర్ధరాత్రి జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్‌లోనూ నీరజ్ గాయంతోనే బరిలోకి దిగడం గమనార్హం. విరిగిన చేతితోనే ఈవెంట్‌లో పాల్గొన్న అతను అత్యుత్తమ ప్రదర్శన చేసి రెండో స్థానంలో నిలవడం విశేషం.

బ్రస్సెల్స్ ఈవెంట్‌తో నీరజ్ ఈ సీజన్‌ను ముగించాడు. ఈ సందర్భంగా ఆదివారం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో తన గాయం గురించి తెలిపాడు. ‘సోమవారం ప్రాక్టీస్‌లో గాయపడ్డాను. ఎక్స్ రేలో ఎడమ చేతి నాలుగో వేలు ఫ్రాక్చర్ అయ్యింది. అయితే, నా టీమ్ సహకారంతో బ్రస్సెల్స్‌లో పాల్గొన్నాను. 2024 సీజన్ ముగిసింది. ఈ ఏడాది నేను నేర్చుకున్న అంశాలు, ఎత్తుపల్లాలు అన్ని తిరిగి చూసుకుంటా. నా సొంత అంచనాలను అందుకోలేనప్పటికీ చాలా నేర్చకున్నా. మళ్లీ పూర్తి ఫిట్‌గా తిరిగొస్తా.’ అని రాసుకొచ్చాడు.

కాగా, డైమండ్ లీగ్‌ ఫైనల్‌లో నీరజ్ ఒక్క సెంటిమీటర్ తేడాతో విజేతగా నిలువలేకపోయాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల త్రోతో చాంపియన్‌గా అవతరించగా.. నీరజ్ 87.86 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. 2022లో విజేతగా నిలిచిన అతను గతేడాది కూడా రన్నరప్‌గానే సరిపెట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed