గాయం వేధిస్తున్నా.. టోర్నీకి సిద్ధమంటున్న నీరజ్

by Harish |
గాయం వేధిస్తున్నా..  టోర్నీకి సిద్ధమంటున్న నీరజ్
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అతను స్విట్జర్లాండ్‌లో జరిగే లసాన్నే డైమండ్ లీగ్‌పై ఫోకస్ పెట్టాడు. ఈ నెల 22న ఈవెంట్ జరగనుంది. కొంతకాలంగా గజ్జల్లో గాయం తనను ఇబ్బంది పెడుతోందని ఇటీవల నీరజ్ చెప్పాడు. దీంతో అతను లసాన్నే డైమండ్ లీగ్‌కు దూరమవుతాడంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ టోర్నీలో తాను పాల్గొంటానని నీరజ్ స్పష్టం చేశాడు.

శనివారం ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘లసాన్నే డైమండ్ లీగ్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నా. నా గాయంతో పెద్దగా ఇబ్బంది లేదు. కాబట్టి, ఈ సీజన్‌ను పూర్తి చేయాలనుకుంటున్నా. ఆ తర్వాత డాక్టర్ సలహా తీసుకుంటా. సెప్టెంబర్ చివర్లో ఇండియాకు వస్తాను. అప్పుడు డాక్టర్‌ను కలిసి గజ్జ గాయానికి చికిత్స తీసుకుంటా.’ అని చెప్పాడు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించిన అతను పారిస్‌లో బంగారు పతకాన్ని అందుకోలేకపోయాడు. 89.45 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు. ఒలింపిక్స్ తర్వాత నీరజ్ ఇండియాకు రాలేదు. నేరుగా స్విట్జర్లాండ్‌కు చేరుకున్న అతను టోర్నీకి సిద్ధమవుతున్నాడు.

Advertisement

Next Story