LPL 2023: చెలరేగిన కుశాల్‌ పెరీరా.. ఫైనల్‌లో డంబుల్లా జట్టు

by Vinod kumar |
LPL 2023: చెలరేగిన కుశాల్‌ పెరీరా.. ఫైనల్‌లో డంబుల్లా జట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: లంక ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌ చివరి దశకు చేరింది. ఇవాళ జరిగిన క్వాలిఫయర్‌-1 ఫలితంతో ఫైనల్‌ బెర్త్‌ ఖరారైంది. క్వాలిఫయర్‌-1లో.. గాలే టైటాన్స్‌పై డంబుల్లా ఔరా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టైటాన్స్‌.. లసిత్‌ క్రూస్‌పుల్లే (80) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌటైంది. టైటాన్స్‌ ఇన్నింగ్స్‌లో లసిత్‌ ఒక్కడే రాణించగా.. మిగతావారంతా విఫలమయ్యారు. షకీబ్‌ (19), షనక (12), లహీరు సమరకూన్‌ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు.

ఇందులో ముగ్గురు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. డంబుల్లా బౌలర్లలో హేడెన్‌ కెర్‌ 3, నూర్‌ అహ్మద్‌ 2, ఫెర్నాండో, హసన్‌ అలీ, ధనంజయ డిసిల్వ తలో వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డంబుల్లా.. 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కుశాల్‌ పెరీరా (53), కుశాల్‌ మెండిస్‌ (49) రాణించగా.. అవిష్క షెర్నాండో (24) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. టైటాన్స్‌ బౌలర్లలో షకీబ్‌, ప్రసన్న, షంషి, షనక తలో వికెట్‌ పడగొట్టారు.

Advertisement

Next Story

Most Viewed