కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి భారీ షాక్.. ఆ ముగ్గురిపై చీటింగ్ కేసు!

by saikumar |   ( Updated:2024-10-17 19:00:58.0  )
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి భారీ షాక్.. ఆ ముగ్గురిపై చీటింగ్ కేసు!
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నేత ప్రహ్లాద్ జోషికి ఊహించని షాక్ తగిలింది. ఆయన సోదరుడు, సోదరి, అల్లుడిపై బెంగళూరు పోలీసులు గురువారం చీటింగ్ కేసు నమోదు చేశారు. బసవేశ్వరనగర్ పోలీసుల కథనం ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్ టికెట్ ఇప్పిస్తానని చెప్పి తనను మోసం చేశారని మాజీ జేడీఎస్ ఎమ్మెల్యే సునీత చౌహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రమంత్రి సోదరుడు గోపాల్ జోషి (ఏ1), సోదరి విజయలక్ష్మి జోషి (ఏ2), గోపాల్ కొడుకు అజయ్ జోషి (ఏ3)పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) ప్రకారం చీటింగ్, నమ్మకద్రోహం, ఎస్సీ/ఎస్సీ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎంపీ ఎన్నికల సమయంలో సునీతా చౌహన్‌కు బాగా పరిచయస్తుడైన శేఖర్ నాయ‌క్‌ అనే వ్యక్తి ద్వారా కేంద్రమంత్రి సోదరుడు గోపాల్ జోషితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది మార్చిలో శేఖర్ నాయక్ తమను హుబ్బళ్లిలోని గోపాల్ ఇంటికి తీసుకెళ్లాడని, గోపాల్‌ని కలిసిన తర్వాత ప్రహ్లాద్ జోషి కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ, కేంద్రం పెద్దలైన ప్రధాని మోడీ, అమిత్ షాలతో ప్రహ్లాద్ జోషికి మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన చెబితే ఎంపీ టికెట్ వస్తుందని.. అందుకోసం రూ.5 కోట్లు సిద్ధంగా ఉంచుకోవాలని, ఈలోగా రూ.25లక్షలు అరెంజ్ చేయాలని గోపాల్ జోషి చెప్పారన్నారు.

దీంతో ఆ డబ్బులు వేరే వాళ్ల అప్పు చేసి బసవేశ్వర నగర్‌లోని విజయలక్ష్మికి గోపాల్ ఆదేశానుసారం ఇచ్చినట్లు పేర్కొంది. అనంతరం గోపాల్ తన సమక్షంలో అమిత్ షా సెక్రటరీకి ఫోన్ చేసి అంతా సవ్యంగా ఉందని హామీ ఇచ్చారని.. సెక్యూరిటీగా రూ.5 కోట్ల చెక్ కూడా తీసుకున్నారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయినప్పటికీ తనకు టికెట్ రాలేదని, తీరా గోపాల్‌ను నిలదీస్తే రూ.5 కోట్ల చెక్ తిరిగి ఇచ్చాడని.. కానీ, రూ.25 లక్షలు తిరిగి ఇవ్వలేనని గోపాల్ చెప్పాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఇటీవల జరిగిన కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(ఎస్) మిత్రపక్షాలుగా పోటీ చేసి మొత్తం 28 స్థానాలకు గాను 19 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed