దులీప్ ట్రోఫీలోకి అనూహ్య ఎంట్రీ.. శతక్కొట్టిన ఇషాన్ కిషన్

by Harish |
దులీప్ ట్రోఫీలోకి అనూహ్య ఎంట్రీ.. శతక్కొట్టిన ఇషాన్ కిషన్
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశవాళీలో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. దులీప్ ట్రోఫీలో సెంచరీతో అదరగొట్టాడు. అనంతపురం వేదికగా భారత ‘బి’ జట్టుతో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో భారత ‘సి’ జట్టు తరపున బరిలోకి దిగిన అతను 126 బంతుల్లో 111 పరుగులు చేశాడు. ‘సి’ తుది జట్టు రివీల్ చేసే వరకూ ఇషాన్ ఆడుతున్నాడని తెలియదు. గాయం కారణంగా తొలి రౌండ్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతన్ని.. ఇటీవల బీసీసీఐ రెండో రౌండ్ జట్లకు ప్రకటించిన జట్లలోనూ చేర్చలేదు. కానీ, అనూహ్యంగా జట్టులోకి వచ్చిన అతను శతకంతో రెచ్చిపోయాడు. ఇషాన్‌తోపాటు బాబా ఇంద్రజిత్(78) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ 3 వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశపై కన్నేసిన ‘సి’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 357/5 స్కోరు చేసింది. ఇన్నింగ్స్‌లో రెండో బంతికే గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(46 బ్యాటింగ్)ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతనితోపాటు మానవ్ సుతార్(8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ‘బి’ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3 వికెట్లతో సత్తాచాటాడు.

ఆదుకున్న షామ్స్ ములానీ

భారత ‘డి’ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ‘ఏ’ జట్టు మొదట్లో దారుణంగా తడబడింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్(7), ప్రథమ్ సింగ్(7), తిలక్ వర్మ(10), రియాన్ పరాగ్(37), శాశ్వత్ రావత్(15) వరుసగా వికెట్లు కోల్పోవడంతో ‘ఏ’ జట్టు 93/5తో కష్టాల్లో పడింది. ఆ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన షామ్స్ ములానీ(88 బ్యాటింగ్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. అతనికితోడు తనూష్ కొటియన్(53) హాఫ్ సెంచరీతో రాణించాడు. షామ్స్ ములానీ అద్భుతమైన పోరాటంతో ‘ఏ’ జట్టు తొలి రోజు మెరుగైన స్కోరు సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 288/8 స్కోరు చేసింది ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా, విద్వత్ కావేరప్ప, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లతో రాణించారు.

Advertisement

Next Story

Most Viewed