ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్

by John Kora |
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్
X

- తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాపై నిషేధం

- ప్రత్యామ్నాయంగా స్కైని ఎంపిక చేసిన యాజమాన్యం

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ప్రారంభ మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ నెల 23న ఆదివారం చిదంబరం స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను నియమించారు. ఈ మేరకు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బుధవారం స్పష్టం చేశారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఆడిన చివరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. అయితే ఈ నిషేధం ఈ సీజన్‌లో ఉంటుందా? ఉండదా? అనే డైలమా నెలకొన్నది. కానీ, హార్దిక్ పాండ్యాపై నిషేధం కొనసాగుతుందని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందినట్లు ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే ధ్రువీకరించారు. దీంతో సీఎస్కేతో జరిగే తొలి మ్యాచ్‌కు హార్దిక్ దూరం కానున్నాడని తెలిపారు. టీమ్ ఇండియా టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్‌గా నియమించినట్లు పేర్కొన్నాడు.

ముంబై ఇండియన్స్ జట్టులో నాయకత్వం వహించడానికి ముగ్గురు సమర్థులు ఉన్నారని హార్దిక్ అన్నారు. అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ, టెస్టు కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ల రూపంలో ఎంఐకి మంచి రీసోర్సెస్ ఉన్నాయని చెప్పారు. ఈ ముగ్గురి మార్గదర్శకాలను తాను తీసుకోవడానికి వెనుకాడనని హార్దిక్ పాండ్యా చెప్పాడు. అయితే జస్ప్రిత్ బుమ్రా గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని, ఐపీఎల్ 2025 తొలి రెండు వారాలు అతని సేవలు అందుబాటులో ఉండవని హార్దిక్ చెప్పాడు. ప్రస్తుత సీజన్‌లో ఓవర్ రేట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని హార్దిక్ పేర్కొన్నాడు. మార్చి 29న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ముంబై ఇండియన్స్ రెండో మ్యాచ్‌లో హార్దిక్ అందుబాటులో ఉంటాడు.

Next Story