IND VS SL : ‘సూపర్’‌గా గెలిచింది.. ఆఖరి టీ20లో శ్రీలంకకు షాకిచ్చిన భారత్

by Harish |
IND VS SL : ‘సూపర్’‌గా గెలిచింది.. ఆఖరి టీ20లో శ్రీలంకకు షాకిచ్చిన భారత్
X

దిశ, స్పోర్ట్స్ : సూర్యకుమార్ నేతృత్వంలోని భారత టీ20 జట్టు అదరగొట్టింది. మూడో టీ20లో ఓటమి అంచుల దాకా వెళ్లి సూపర్ విజయం అందుకుంది. దీంతో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం పల్లెకెలె వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20లో భారత్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 137/9 స్కోరు చేసింది. గిల్(39), రియాన్ పరాగ్(26), సుందర్(25) పర్వాలేదనిపించగా.. జైశ్వాల్(10), శాంసన్(0), రింకు(1), కెప్టెన్ సూర్య(8) నిరాశపర్చడంతో జట్టు స్వల్ప స్కోరే చేసింది.

అనంతరం ఛేదనకు దిగిన శ్రీలంక‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులే చేసింది. కుసాల్ పెరీరా(46), కుసాల్ మెండిస్(43) రాణించడంతో ఒక దశలో భారత్ ఓటమి ఖాయమే అనిపించింది. కానీ, ఆలస్యంగా పుంజుకున్న భారత బౌలర్లు వరుస వికెట్లు తీసి శ్రీలంకను నిలువరించారు. ముఖ్యంగా ఆఖరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయానికి 9 పరుగులు కావాల్సి ఉండగా కెప్టెన్ సూర్య సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 19వ ఓవర్‌ను రింకుతో వేయించగా అతను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రింకు ఒకే ఓవర్‌లో పెరీరా, రమేశ్ మెండిస్‌(3)లను అవుట్ చేయడంతోపాటు 3 పరుగులే ఇచ్చాడు. ఇక, ఆఖరి ఓవర్ సూర్యనే వేశాడు. ఆ ఓవర్‌లో కామిందు మెండిస్(1), తీక్షణ(0)లను అవుట్ చేసి ఐదు పరుగులే ఇవ్వడంతో స్కోర్లు సమమై మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.

సూపర్ ఓవర్‌లో శ్రీలంక ముందుగా బ్యాటింగ్‌కు దిగగా.. సుందర్ రెండు వికెట్లు తీసి మూడు బంతుల్లోనే ఆ జట్టు ఇన్నింగ్స్‌ను ముగించాడు. శ్రీలంక రెండు పరుగులే చేయగా.. సూర్యకుమార్ తొలి బంతికే ఫోర్ కొట్టడంతో భారత్ విజయం లాంఛనమైంది.

సంక్షిప్త స్కోరుబోర్డు

భారత్ ఇన్నింగ్స్ : 137/9(20 ఓవర్లు)

(గిల్ 39, రియాన్ పరాగ్ 26, సుందర్ 25, తీక్షణ 3/28, హసరంగ 2/29)

శ్రీలంక ఇన్నింగ్స్ : 137/8(20 ఓవర్లు)

(కుసాల్ పెరీరా 46, కుసాల్ మెండిస్ 43, సూర్య 2/5, రింకు 2/3, సుందర్ 2/23, రవి బిష్ణోయ్ 2/38)

Advertisement

Next Story

Most Viewed