సంచలన నిర్ణయం తీసుకున్న దీప కర్మాకర్.. జిమ్నాస్టిక్స్‌కు వీడ్కోలు

by Harish |
సంచలన నిర్ణయం తీసుకున్న దీప కర్మాకర్.. జిమ్నాస్టిక్స్‌కు వీడ్కోలు
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా ఘనత సాధించిన 31 ఏళ్ల దీప జిమ్నాస్టిక్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. సోమవారం ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించింది. జిమ్నాస్టిక్స్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని తెలిపింది.

‘చాలా ఆలోచించిన తర్వాత జిమ్నాస్టిక్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నా. ఈ నిర్ణయం నాకు సులభమైనది కాదు. కానీ, ఇదే సరైన సమయమని భావించా. జిమ్నాస్టిక్స్‌కు నా జీవితంలో పెద్ద పాత్ర పోషించింది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. నేను సాధించిన దాని పట్ల గర్వంగా ఉన్నా. దేశానికి ప్రాతినిధ్యం వహించడం, పతకాలు సాధించడం.. ముఖ్యంగా రియో ఒలింపిక్స్‌లో ప్రొడునోవా వాల్ట్ ప్రదర్శన మరుపురాని జ్ఞాపకాలు. ఈ ఏడాది ఏషియన్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాను. అదే నా చివరి విజయం. అదే కెరీర్‌కు మలుపు. అప్పటి వరకు నా శరీరాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లగలనని అనుకున్నాను. కానీ, కొన్నిసార్లు మన శరీరం విశ్రాంతి కోరుకుంటుంది.’ అని దీప రాసుకొచ్చింది.

కాగా, 6 ఏళ్ల వయసులో జిమ్నాస్టిక్స్‌లో అడుగుపెట్టిన దీప.. దేశంలో జిమ్నాస్టిక్స్ అంటే దీపనే అనేలా గుర్తింపు పొందింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారత మహిళా జిమ్నాస్ట్ ఆమెనే. రియో ఒలింపిక్స్‌-2016లో దీప పాల్గొంది.వాల్ట్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచి కేవలం 0.15 పాయింట్లతో కాంస్య పతకాన్ని కోల్పోయింది.

Advertisement

Next Story