సాత్విక్ జోడీ అదరహో.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం

by Harish |
సాత్విక్ జోడీ అదరహో.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి అదరగొట్టింది. వరుసగా గత రెండు టోర్నీల్లో ఫైనల్‌లో ఓడిపోయిన సాత్విక్ జోడీ ఎట్టకేలకు ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ సొంతం చేసుకుంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో పురుషుల డబుల్స్ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో సాత్విక్ జోడీ 21-11, 21-17 తేడాతో చైనీస్ తైపీకి చెందిన లీ జే హుయే-యాంగ్ పో హ్సువాన్‌ జంటను చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది.

ఈ టోర్నీలో సాత్విక్-చిరాగ్ జంట మొదటి రౌండ్ నుంచి జోరు కనబర్చింది. ప్రతి మ్యాచ్‌నూ వరుస సెట్లలో గెలుచుకోవడం విశేషం. ఫైనల్‌లోనూ అదే దూకుడును కొనసాగించింది. కేవలం 37 నిమిషాల్లోనే ప్రత్యర్థుల ఆటను ముగించింది. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన సాత్విక్ జోడీ టైటిల్ పోరును కూడా వరుస సెట్లలోనే దక్కించుకుంది. తొలి గేమ్ ఆసక్తికరంగానే మొదలైన 4-4 తర్వాత భారత ద్వయం పూర్తిగా గేమ్‌ను ఆధీనంలోకి తీసుకుంది. వరుసగా ఐదు గేమ్‌లు నెగ్గి 9-4తో లీడ్‌లోకి వెళ్లగా ఆ తర్వాత కూడా అదే జోరుతో ప్రత్యర్థి జంటకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు.

అనంతరం చైనీస్ తైపీ ద్వయం పుంజుకోవడంతో రెండు గేమ్‌తో మాత్రం రసవత్తరంగా సాగింది. మొదట్లో ప్రత్యర్థులు 4-1తో ఆధిక్యంలోకి వెళ్లారు కూడా. ఆ తర్వాత సాత్విక్, చిరాగ్ పోటీనిచ్చినా ఒక దశకు వరకు చైనీస్ జంటనే కాస్త ముందుంది. ఈ పరిస్థితులో దూకుడు పెంచిన సాత్విక్ జోడీ 14-14తో స్కోరును సమం చేయడమే కాకుండా వరుసగా పాయింట్లు గెలుచుకుని 17-4తో ఆధిక్యం సాధించింది. అదే దూకుడులో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలువడం భారత జంటకు ఇది రెండోసారి. 2022లో మొదటిసారి చాంపియన్‌గా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed