భారత మహిళలు అదరహో.. బంగ్లాపై వరుసగా నాలుగో విజయం

by Dishanational3 |
భారత మహిళలు అదరహో.. బంగ్లాపై వరుసగా నాలుగో విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య బంగ్లాదేశ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్.. వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. సిల్హెట్ వేదికగా సోమవారం జరిగిన నాలుగో టీ20లో డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం బంగ్లా‌పై 56 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో రెండు ఇన్నింగ్స్‌లను 14 ఓవర్ల చొప్పున కుదించి మ్యాచ్ నిర్వహించారు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 14 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(39) టాప్ స్కోరర్‌గా నిలిచింది. స్మృతి మంధాన(22), హేమలత(22), రిచా ఘోష్(24) పర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ప్రత్యర్థిని భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో బంగ్లాదేశ్ 14 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 68 పరుగులకే పరిమితమైంది. దిలారా అక్టర్(21) టాప్ స్కోరర్. భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, ఆశా శోభన రెండేసి వికెట్లతో సత్తాచాటారు. ఈ విజయంతో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్ సిరీస్ క్లీన్‌స్వీప్ కన్నేసింది. గురువారం చివరిదైన ఐదో టీ20 జరగనుంది.

Next Story

Most Viewed