‘రెచ్చగొడితే రెచ్చిపోం.. ఏం చేయాలో మాకు తెలుసు’

by srinivas |
‘రెచ్చగొడితే రెచ్చిపోం.. ఏం చేయాలో మాకు తెలుసు’
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రా-తెలంగాణల మధ్య నెలకొన్న జలవివాదాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీటి వివాదాలపై రెండు రాష్ట్రాలు చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని, అందుకోసం ఏంచేయాలో అన్నీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. తాము రెచ్చగొడితే రెచ్చిపోమని, సందర్భోచితంగా స్పందిస్తామన్నారు. అంతేకాదు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల వివాదాలపై ఇప్పటికే అందరికీ లేఖలు రాశామని, కేంద్రం కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందని సజ్జల వెల్లడించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని స్పష్టం చేశారు.

మెగా ఇళ్ల శంకుస్థాపన రికార్డ్ బ్రేక్

రాష్ట్రంలో జరుగుతున్న మెగా ఇళ్ల శంకుస్థాపన ఒక రికార్డు సృష్టించిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నట్లు తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన తండ్రికి మించిన తనయుడు అని సీఎం వైఎస్‌ జగన్‌ నిరూపించుకున్నారని కొనియాడారు. ఆనాడు వైఎస్‌ఆర్‌ తలపెట్టిన గృహనిర్మాణం అంతా అసాధ్యం అనుకుంటే మహానేత సుసాధ్యం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ అదే చేశారన్నారు. రాష్ట్రంలోని 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు 25 వేల ఎకరాల ప్రైవేట్‌ ల్యాండ్‌ కొని పేదలకు ఇళ్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు. వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేశామని, నేడు ప్రతి లబ్ధిదారుడి కళ్లలో నిజమైన ఆనందం కనబడుతోందని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలపై కొన్ని పత్రికలు వక్రీకరించి వార్తలు రాస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. జగనన్న కాలనీల వల్ల చాలామందికి పరోక్ష ఉపాధి దొరుకుతోందని సజ్జల తెలిపారు.

Advertisement

Next Story