ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే రేషన్​ సరుకులు

by  |
ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే రేషన్​ సరుకులు
X

దిశ, ఏపీబ్యూరో : ఫిబ్రవరి ఒకటి నుంచి లబ్దిదారులకు నేరుగా ఇంటికే రేషన్​ సరకులను సరఫరా చేస్తామని సీఎం వైఎస్​ జగన్​ వెల్లడించారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ధాన్యం సేకరించిన తర్వాత 15 రోజుల్లోగా పేమెంట్లు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి ఈ సంక్రాంతి కల్లా రైతుల బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన బిల్లులు పెండింగులో పెట్టకూడదని చెప్పారు.

ఈ ఖరీఫ్‌కు సంబంధించి నిర్ణీత లక్ష్యం ప్రకారం ధాన్యాన్ని సేకరించాలని సీఎం సూచించారు. నిత్యావసర సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన ప్రత్యేక వాహనాలు ఈ నెల 3వ వారంలో ప్రారంభించడానికి సీఎం నిర్ణయించారు. ఎస్సీలకు 2,333, ఎస్టీలకు 700, బీసీలకు 3,875, ఈబీసీలకు 1,616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్‌ మైనారిటీలకు 85 వాహనాలు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సరకుల సరఫరా కోసం 9,260 మొబైల్​యూనిట్లు, ఆధునిక తూకం యంత్రాలను సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed