ఆర్థిక ఫలితాలే కీలకం!

by Shyam |   ( Updated:2020-10-11 09:10:27.0  )
ఆర్థిక ఫలితాలే కీలకం!
X

దిశ, వెబ్‌డెస్క్: గతవారం అద్భుతమైన ప్రదర్శన తర్వాత పెట్టుబడిదారుల సంపద గరిష్ఠ స్థాయిలకు చేరుకుంది. ముఖ్యంగా ఐటీ సంస్థల మద్దతుతో ఈక్విటీ మార్కెట్లు భారీగా లాభాలను నమోదు చేశాయి. అయితే, ఈ వారంలో మార్కెట్లు ప్రధానంగా భారీ ఆదాయాల దిశగా కదిలే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఐటీ సంస్థల ఆర్థిక ఫలితాలు, త్రైమాసిక, ఆర్థిక సంవత్సరంపై కంపెనీల సమీక్షలు ఈ వారం కీలకంగా ఉండనున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

అలాగే, ఈ వారంలో మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్, యూటీఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ అవనున్నాయి. ఈ అంశం కూడా మార్కెట్లు ముందుకెళ్లడానికి దోహదపడతాయని తెలుస్తోంది. అంతేకాకుండా, అమెరికా రెండో ఉద్దీపన ప్యాకేజీ అంశాన్ని కూడా పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా రుణాల మారటోరియం నిషేధం కేసులో సుప్రీంకోర్టు తీర్పు కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నారు. ఇవి కూడా ఈ వారం మార్కెట్లకు కీలకం కానున్నాయి.

ఈ వారం స్టాక్ మార్కెట్లను నిర్దేశించే ముఖ్యమైన అంశాలు :

రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

ఈ వారంలో ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మైండ్‌ట్రీ లాంటి కీలక ఐటీ మేజర్లు తమ జూన్ త్రైమాసిక ఆదాయాలను ప్రకటించనున్నాయి. ఈ ఫలితాలు మార్కెట్లను మార్గనిర్దేశం చేయనున్నాయి. గత వారం ఐటీ రంగంలోని దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఫలితాల తర్వాత మార్కెట్లు కొంత ప్రభావితమయ్యాయి.

అమెరికా ఉద్దీపనపై పురోగతి..

కరోనా వైరస్ సహాయ బిల్లుపై మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు నిలిపేయడం, వైట్‌హౌస్,డెమోక్రటిక్ నాయకుల మధ్య చర్చలు తిరిగి ప్రారంభమవడం, అలాగే, ట్రంప్ ప్రభుత్వం నుంచి కొత్త ఆర్థిక ఉద్దీపన ప్రతిపాదన ఎటూ తేలకపోవడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి.

భారత రెండో ఆర్థిక ఉద్దీపన..

గతవారం ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ మాట్లాడుతూ..భారత ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరిగేందుకు తగిన సమయంలో మరింత ఆర్థిక ఉద్దీపన ప్రకటించాల్సిన అవసరముందని ప్రభుత్వం గుర్తించినట్టు చెప్పారు. ప్రభుత్వం రెండో ఆర్థిక ఉద్దీపన అంచించవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించిన తర్వాత సంజీవ్ సన్యాల్ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఈ పరిణామాలను మార్కెట్ వర్గాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి.

ఐపీఓ లిస్టింగ్..

మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్, యూటీఐ ఏఎంసీ సంస్థ సోమవారం లిస్టింగ్‌కు రానున్నాయి. మజగాన్ లిస్టింగ్ ద్వారా కొంత సానుకూలంగా మార్కెట్లను ప్రారంభించే అవకాశాలున్నాయని, మ్యూచువల్ ఫండ్ సంస్థ యూటీఐ ఇష్యూ ధర ఫ్లాట్‌గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మారటోరియం నిషేధంపై సుప్రీంకోర్టు తీర్పు..

కీలమైన మారటోరియం కేసును సుప్రీంకోర్టు అక్టోబర్ 13న విచారించనుంది. కొవిడ్-19 సంక్షోభవం వల్ల దెబ్బతిన్న రంగాలకు మరింత ఉపశమనం ఇవ్వడం సాధ్యం కాదై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తన అఫిడవిట్‌లో పేర్కొంది మారటోరియం ఆరు నెలలకు మించి పొడిగించడం కూడా సాధ్యం కాదని ఆర్‌బీఐ తెలిపింది. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపించనుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్తున్నాయి.

ఎఫ్ఐఐల ప్రభావం..

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) నుంచి బలమైన మద్దతు మార్కెట్లలో ర్యాలీ కొనసాగేందుకు దోహదపడుతుందని, తద్వారా గతవారం ధోరణి ఈ వారం కూడా కొనసాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతవారం ఈక్విటీ విభాగంలో ఎఫ్ఐఐలను గమనిస్తే…స్థూల కొనుగోళ్లు రూ. 29,295 కోట్లు ఉండగా, స్థూల అమ్మకాలు రూ. 23,785 కోట్లుగా నమోదైంది. అంటే, నికర ఎఫ్ఐఐల ప్రవాహం రూ. 5,510 కోట్లుగా ఉందని తెలుస్తోంది.

టీకా పురోగతి..

ఫైజర్ వ్యాక్సిన్ చివరి దశ, మోడెర్నా ఇంక్ వ్యాక్సిన్ రెండో దశ ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 182 వ్యాక్సిన్ ప్రయోగాలు క్లినికల్ పరీక్షల దశలో ఉన్నాయి. వీటిలో 36 పరీక్షలు, 9 మానవ పరీక్షలు తుది దశలో ఉన్నాయి. వీటి ఫలితాల పరిణామాలు కూడా ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని తెలుస్తోంది.

జాతీయ గణాంకాలు..

అక్టోబర్ 12న విడుదల కానున్న పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), వినియోగదారు ధరల సూచీ(సీపీఐ)ల గణాంకాలు సైతం మార్కెట్లౌ కొంత ప్రభావితం చేయనున్నాయి. మదుపర్లు ఈ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా అక్టోబర్ 14న ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు సంబంధించిన టోకు ధరల సూచీ(డబ్ల్యూఈఐ) డేటాను వెల్లడించనుంది. అంతకుముందు నెలలో డబ్ల్యూపీఐ 0.58 శాతం పతనమైన తర్వాత, ఆగష్టులో గతేడాదితో పోలిస్తే 0.16 శాతం పెరిగింది. కావున ఈ సెప్టెంబర్ డేటా మార్కెట్లపై ప్రభావం చూపనుంది.

Advertisement

Next Story

Most Viewed