గడప గడపకు మన ప్రభుత్వంలో చేపట్టిన సిమెంట్ రోడ్డు.. చూస్తే వావ్ అంటారు..!

by Disha Web Desk 3 |
గడప గడపకు మన ప్రభుత్వంలో చేపట్టిన సిమెంట్ రోడ్డు.. చూస్తే వావ్ అంటారు..!
X

దిశ కొండపి: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్ర గ్రామీణ పంచాయితీ రాజ్ వ్యవస్థ ద్వారా చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం అభివృద్ధికి జిజిఎంపిలో చేపట్టిన సిమెంట్ రోడ్డు నిదర్శనంగా ఉంది. పేదలకు సొంత ఇంటి కల నెరవేరాలని కేంద్ర ప్రభుత్వం, గ్రామీణ ప్రాంతాలలో మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రత్యేకంగా జగనన్న కాలనీ లేఅవుట్‌లను సిద్ధం చేసింది.

అయితే ఆ కాలనీల సంగతి ఎట్లా ఉన్నా స్థానిక నాయకులకు కల్ప తరువుగా చేపట్టిన మట్టి పనులు, ఇసుక, ప్రధాన రహదారి నుండి జగనన్న కాలనీలకు సిమెంట్ రోడ్ల నిర్మాణం ఆర్థిక వనరుగా మారింది. దానికి మండల పరిషత్ అధికార యంత్రాంగం, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు చేపట్టిన పనుల్లో పాటించిన నాణ్యతకు, చింతల పాలెం జగనన్న కాలనీకి వేసిన సిమెంట్ రోడ్డు నిదర్శనంగా నిలుస్తోంది.

రోడ్డు నిర్మాణంలో ఎంత నాణ్యతను పాటించారంటే.. వేసిన రోడ్లు నెల రోజులకే పగుళ్లతో కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావిడిగా ఏదో సాధించిన బిల్డప్‌లో వేసిన రోడ్డు అధ్వానంగా మారింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ శ్రేణులు వారికి అనుగుణంగా ప్రభుత్వ మండల పరిషత్, పంచాయితీ రాజ్ అధికారులు చేపట్టిన నిర్వాకం ప్రజలకు శాపంగా మారింది.

బిల్లులు చేసుకుందాం, డబ్బు దోచుకుందాం అన్న తపనే తప్ప ప్రజల బాధలు పట్టవా అని స్థానికులు వాపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు మౌలిక సదుపాయాల కల్పన పనులు కేవలం స్థానిక అధికార పార్టీ శ్రేణులు, సంబంధిత అధికారులకు కల్ప తరువుగా మారిందేతప్ప తమ సమస్యలు మాత్రం తీరలేదని ప్రజలు ఆవేదన వ్యకం చేస్తున్నారు.



Next Story