AP Elections 2024: శిఖరమంత నాయకుడు... కొండంత అండగా..

by Disha Web Desk 3 |
AP Elections 2024: శిఖరమంత నాయకుడు... కొండంత అండగా..
X

దిశ, ప్రతినిధి, విజయవాడ: పశ్చిమ నియోజక వర్గంలో అధిక భాగం ప్రజలు కొండల పైనే నివసిస్తున్నారు. ముఖ్యంగా పేద వర్గాల ప్రజలే ఎన్నో కష్టాలతో కొండలపై బతుకుని వెళ్లదీస్తున్నా ఇప్పటి వరకు ఏ ప్రజా నాయకుడు ఈ కొండల శిఖరాగ్ర భాగం వరకు వెళ్లింది లేదు. అయితే నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి మాత్రం కొండలపై ప్రచారానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.

కార్పొరేట్ సెక్టర్ నుంచి వచ్చిన సుజనా ఇలా పేదవర్గాల ప్రజలను స్పృశించగలరా? అనే కొందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ అలవోకగా కొండల మెట్లు ఎక్కేస్తున్నారు. కొండ ప్రాంతాల ప్రజల సమస్త కష్టాలను ఆకళింపు చేసుకున్నారు. కొన్నిచోట్ల సౌకర్యం లేని ప్రదేశాల్లో, మెట్ల పైనే సుజనా కూర్చుని ప్రజలతో మాట్లాడారు.

అసలు తమ కోసం ఇంత శ్రమకు ఓర్చి కొండలపైకి ఎక్కిన నాయకుడిని ఇదే తొలిసారిగా చూడడం అని ప్రజలు అంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం రాలేదని, ప్రతి సమస్యను తీర్చెందుకే తాను మీ ముందుకు వచ్చానంటూ కొండ ప్రాంతాల ప్రజలకు సుజనా భరోసా ఇస్తున్నారు.

Next Story

Most Viewed