సీఎం జగన్‌ను మోసం చేసిన వారెవరూ రాజకీయాల్లో మనలేరు.. మంత్రి మేరుగు నాగార్జున

by Javid Pasha |
సీఎం జగన్‌ను మోసం చేసిన వారెవరూ రాజకీయాల్లో మనలేరు.. మంత్రి మేరుగు నాగార్జున
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మోసం చేసిన వారెవరూ రాజకీయాల్లో మనలేరని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. గతంలో వైఎస్ జగన్‌కు వెన్నుపోటు పొడిచి ప్రస్తుతం రాజకీయాల్లో కనుమరుగైపోయిన నేతలే దీనికి సాక్ష్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో నాగార్జున మాట్లాడారు. గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, మహిళల్ని వివస్త్రలుగా చేసిన అమానుషకృత్యాలు అనేకం జరిగినా కేసులు కూడా పెట్టేవారు కాదని మంత్రి మేరుగ గుర్తు చేశారు. అనేక సంఘటనల్లో దళితులు కేసులు పెట్టాలని పోలీస్టేషన్ల ఎదుట ధర్నాలు కూడా చేసిన దాఖలాలనేకమన్నారు. అప్పట్లో దళితులపై దాడులు జరిగితే కనీసం కేసులు కూడా పెట్టని టీడీపీ నేతలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వపాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దళితుల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించడం, రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం, డీబీటీ ద్వారా దళితులకు నేరుగా వేల కోట్ల రూపాయలు అందించడం మీకు అత్యాచారాలుగా కన్పిస్తున్నాయా? అని టీడీపీ నేతలను మంత్రి మేరుగ నాగార్జున నిలదీశారు.

ఉండవల్లి శ్రీదేవి తప్పు చేసింది

మరోవైపు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ చమట చుక్కలతో గెలిచిన శ్రీదేవి ఇప్పుడు తమ పార్టీ మీద బురద చల్లడం సమంజసం కాదని చెప్పుకొచ్చారు. శ్రీదేవి తప్పు చేసింది కాబట్టే భయపడి హైదరాబాద్‌లో దాక్కుందని అభిప్రాయపడ్డారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి దళిత మహిళ అని చెప్పుకుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఆమె గురించి ఆలోచించేంత సమయం కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉండదని చెప్పారు. శ్రీదేవి ఆస్తులు, ఆమె పార్టీ ఆఫీసు జోలికివెళ్లాల్సిన అవసరం తమకు ఏముందని నిలదీశారు. శ్రీదేవి తానే దాడులు చేయించుకొని ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీదేవి ఎందుకు అలా మాట్లాడుతుందో తెలియడం లేదని.. కావాలనే మాట్లాడుతుందా.. లేకపోతే ఆమెతో అలా మాట్లాడిస్తున్నారా.. లేకపోతే ఆమెకు మతి భ్రమించిందా? అని మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed