ఆ గుడిసెలే టార్గెట్..!

by Shyam |   ( Updated:2020-10-20 22:23:17.0  )
ఆ గుడిసెలే టార్గెట్..!
X

సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను మచ్చిక చేసుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పర్యటిస్తూ.. గొత్తికోయలతో ముచ్చటిస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్‌లో వారికి ఏ ఇబ్బంది తలెత్తినా పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.

దిశ ప్రతినిధి, కరీంనగర్: సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు తీవ్రం కావడంతో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పోలీసులు రూట్ మార్చారు. పరివాహక ప్రాంతాల్లోని ప్రజల కష్టాలను తెలుసుకుని వారితో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికేమైనా సమస్యలు ఎదురైతే డైరెక్ట్‌గా పోలీసులను ఆశ్రయించేలా పర్యటిస్తున్నారు.

ప్రజల సమస్యలపై ఫోకస్..

ఉన్నత స్థాయి అధికారుల సూచనల మేరకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో పోలీసులు పర్యటిస్తున్నారు. పంచాయితీలు, ప్రభుత్వ శాఖల ద్వారా పరిష్కరించాల్సిన సమస్యలు అన్నింటినీ తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాణహిత, గోదావరి, ఇంద్రావతి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.

గుత్తికోయలపై ప్రత్యేక నిఘా..

స్థానిక ప్రజలతో మమేకం అవుతూనే దాదాపు దశాబ్దంనర క్రితం సరిహద్దు అటవీ ప్రాంతాల్లోకి వలస వచ్చి నివాసం ఉంటున్న గొత్తికోయల కదలికలపై ప్రత్యేక నిఘా వేశారు. అటవీ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న గొత్తి కోయలను మావోయిస్టులు పావులుగా వాడుకుంటున్నారనే పక్కా సమాచారంతో వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే కొంతమంది సానుభూతి పరులను, కొరియర్లను కూడా అరెస్ట్ చేశారు.

సురక్షిత ప్రాంతాలకు నేతలు..

మావోయిస్టుల కదలికలు సరిహద్దు ప్రాంతాల్లో తిరిగి ప్రారంభం కావడంతో పాటు యాక్షన్ టీంలు కూడా రంగంలోకి దిగాయని నిఘా వర్గాలు సమాచారం అందుకున్నాయి. అంతేగాకుండా ఆయా ప్రాంతాల్లో వెలిసిన కరపత్రాల్లో కూడా అధికార పార్టీ నాయకులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేశామని మావోయిస్టులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజా ప్రతినిధులను, అధికార పార్టీ నాయకులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అయితే ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని నాయకుల గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు సదరు ప్రజా ప్రతినిధికి కాల్ చేసి యోగ క్షేమాలు అడుగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed