ఇకపై ఫోన్ నంబర్ కు ఛార్జీ!..మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్

by Prasad Jukanti |
ఇకపై ఫోన్ నంబర్ కు ఛార్జీ!..మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో:సిమ్ కార్డులు వినియోగిస్తున్న కోట్లాది మంది భారతీయులకు షాకింగ్ న్యూస్. ఇప్పటికే పెరిగిపోతున్న మొబైల్ రీచార్జిలతో సతమతం అవుతున్న యూజర్లపై మరో అదనపు భారం మోపేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపై మీ మొబైల్ నెంబర్ కు రీచార్జి చేయడమే కాదు మీరు వినియోగిస్తున్న మొబైల్ నంబర్ కూ ఛార్జీ వసూలు చేసేందుకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త సిఫార్సులు సిద్ధం చేస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీని ప్రకారం ఫోన్ నంబర్ కు ల్యాండ్ లైన్ నంబర్ కు చార్జీలు వసూలు కొత్త సిఫార్సు చేయబోతున్నట్లు తెలుస్తోంది. సహజ వనరుల్లానే ఫోన్ నంబర్ కూడా చాలా విలువైనదని ట్రాయ్ భావిస్తుండటమే ఈ ప్రతిపాదనకు కారణం అని తెలుస్తోంది. ఫోన్ నంబర్లు అపరిమితం కాదు కాబట్టి వాటి దుర్వినియోగానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ఆ దేశాల్లోఇప్పటికే అమలు:

ఇతరహా విధానం ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఇప్పటికే అమలులో ఉంది. గతేడాది ఆమోదం పొందిన టెలికాం చట్టంలోనూ నంబర్ కు చార్జీ వసూలు చేయాలన్న నిబంధన ఉంది. దీంతో ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే నంబర్ కు ఒకేసారి చార్జి వసూల్ చేయాలా లేక ఏటా కొంతా వసూలు చేస్తారా అనేది సందేహంగా మారింది. అయితే విధానం అమల్లోకి వస్తే దీంతో ఈ చార్జీలను టెలికాం ఆపరేటర్ల నుంచి తొలుత వసూలు చేస్తే.. ఆయా కంపెనీలు ఆ భారాన్ని అంతిమంగా వినియోగదారులపై విధించే అవకాశాలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది

ఆపరేటర్లకు ఫెనాల్టీ?:

గతంలో సిమ్ కార్డు పొందాలంటే చాలా పెద్ద ప్రాసెస్ తో పాటు రుసుము చెల్లించాల్సి ఉండేది. ఆ తర్వాత టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ కారణంగా ఉచిత సిమ్ కార్డుల జారీ ప్రారంభమైంది. అప్పటి నుంచి సిమ్ కార్డులు చాక్లెట్ల మాదిరిగా ఇష్ట రీత్యా తీసుకునే వారు పెరిగిపోయారు. అలాగే ప్రస్తుతం వస్తున్న మొబైల్ ఫోన్లు చాలా వరకు డ్యూయల్ సిమ్ కార్డు సపోర్ట్ తో వస్తున్నాయి. దీంతో చాలా మంది రెండో సిమ్ కార్డు వాడుతునప్పటికీ రిచార్జీ మాత్రం ఎప్పటికో చేయడం లేదు. అయితే తమ కస్టమర్ బేస్ తగ్గిపోతుందన్న భయంతో ఇలాంటి నంబర్ల విషయంలో టెలికాం కంపెనీలు సైతం చర్యలు తీసుకోవడం లేదు. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే తక్కువ వినియోగం కలిగిన నంబర్ల విషయంలో టెలికాం కంపెనీలకు పెనాల్టీ సైతం విధించబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నంబర్లకు చార్జీ విధానం మన దేశంలో ఎంత వరకు అమల్లోకి వస్తుందో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed