యుద్ధం వద్దు.. దౌత్యానికి సహకరిస్తాం: బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ

by Mahesh Kanagandla |
యుద్ధం వద్దు.. దౌత్యానికి సహకరిస్తాం: బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: 16వ బ్రిక్స్ సదస్సులో భాగంగా నిర్వహించిన పరిమితి ప్లీనరీ సెషన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. భారత్ ఎప్పటికీ యుద్ధానికి మద్దతు ఇవ్వదని, వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యానికి సహకరిస్తుందని వివరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-హమాస్, హిజ్బుల్లా సంస్థల మధ్య, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోడీ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘మేం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తాం కానీ, యుద్ధానికి కాదు. కోవిడ్ వంటి భీకర సవాల్‌ను కలిసికట్టుగా ఎదుర్కొన్నట్టు భావి తరాలకు సంపన్న భవిష్యత్‌ను అందించే సామర్థ్యాలు మనకు ఉన్నాయి. అలాగే, సైబర్ సెక్యూరిటీ, సురక్షిత ఏఐ కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనల కోసం పని చేయాలి’ అని మోడీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, ఉగ్రవాదానికి అందే ఆర్థిక సహకారంపై బ్రిక్స్ దేశాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ‘ఉగ్రవాదం వంటి తీవ్ర సమస్యలపై ద్వంద్వ వైఖరి సరికాదు. మన దేశాల్లో యువత ఉగ్రవాద బాటపట్టకుండా చర్లయు తీసుకోవాలి, ఐరాసలో పెండింగ్‌లో ఉన్న ఉగ్రవాద అంశంపై పని చేయాలి’ అని వివరించారు.

‘యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశ్చితి, పర్యావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి అనేక సవాళ్ల సందర్భంలో మన సమావేశం జరుగుతున్నది. సాంకేతిక యుగంలో సైబర్ సెక్యూరిటీ, డీప్ ఫేక్ డిస్ఇన్ఫర్మేషన్ వంటి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నేటి తరుణంలో బ్రిక్స్ నుంచి అనేక ఆశలు, అంచనాలు ఉన్నాయి. వైవిధ్య దేశాలున్న బ్రిక్స్ వేదిక ఈ సమస్యల పరిష్కారంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నాను. బ్రిక్స్ ప్రజా ప్రయోజనాలకు పాటుపడే కూటమి అని ప్రపంచానికి సందేశాన్ని ఇవ్వాల్సి ఉన్నది’ అని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

ఐరాస భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థల సంస్కరణకు నిర్ణీత కాలవ్యవధితో ముందుకు పోవాలని బ్రిక్స్ దేశాలకు మోడీ సూచన చేశారు. ‘బ్రిక్స్‌ను ముందుకు తీసుకెళ్లుతున్న సమయంలో ఓ జాగ్రత్త తీసుకోవాల్సి ఉన్నది. అంతర్జాతీయ సంస్థలను భర్తీ చేయడానికి బ్రిక్స్ రావడం లేదని, కేవలం వాటిని సంస్కరించాలనే బ్రిక్స్ భావిస్తున్నదనే సందేశం స్పష్టంగా ఉండాలి’ అని వివరించారు. అలాగే, బ్రిక్స్‌లోకి కొత్త దేశాలను ఆహ్వానిస్తూ కూటమిలోని వ్యవస్థాపక దేశాలను గౌరవిస్తూ, ఇది వరకే రూపొందించుకున్న నిబంధనలను సభ్య దేశాలన్నీ పాటించవలసిందిగా కోరారు.

Advertisement

Next Story

Most Viewed