Sri Lanka: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్కిస్ట్ నేతకు ఆధిక్యం

by Shamantha N |
Sri Lanka: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్కిస్ట్ నేతకు ఆధిక్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్థిక మందగమనం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలక పోలింగ్ జరిగింది. శనివారం ఓటింగ్ జరగగా.. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో మార్క్సిస్ట్ నేత అనురకుమార దిశనాయకే ఆధిక్యంలో ఉన్నారు. నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ అలయన్స్‌ తరఫున బరిలోకి దిగిన దిశనాయకేకు 53 శాతం ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. ఆయనే ముందజలో ఉన్నట్లు శ్రీలంక ఎన్నికల కమిషన్ డేటా వెల్లడించింది. ఇక, ప్రతిపక్ష నాయకులు సజిత ప్రేమదాస 22శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు విక్రమసింఘే మూడో స్థానంలో ఉన్నారు.

త్రిముఖ పోరు

ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు విక్రమ సింఘేతో పాటు నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (NPP)కి చెందిన అనుర కుమార దిసనాయకే, సమగి జన బలవేగయ (SJB) పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్‌ ప్రేమదాస(57) పోటీలో ఉన్నారు. ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఆధారంగా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వారిని ప్రెసిడెంట్ గా ఎన్నికవుతారు.తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే.. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఇకపోతే, శనివారం పోలింగ్‌ పూర్తయిన తర్వాత నుంచే పోస్టల్‌ ఓట్లను లెక్కించడం ప్రారంభించారు. సాయంత్రం 6 తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు మొదలైందని కొలంబో డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ఎంకేసీకేకే బండరామప వెల్లడించారు. సోమవారం లోగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం 1.7 కోట్ల మంది నమోదిత ఓటర్లలో 75 శాతానికి పైగా ప్రజలు ఓటు వేశారు. 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 83 శాతం ఓట్లు పోలయ్యాయి.

Next Story

Most Viewed