South India rains: భారీ వర్షాలకు బెంగళూరు, చెన్నైలోని అన్ని విద్యాసంస్థలు బంద్

by Shamantha N |
South India rains: భారీ వర్షాలకు బెంగళూరు, చెన్నైలోని అన్ని విద్యాసంస్థలు బంద్
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల చెన్నై అతలాకుతలమైంది. చెన్నై సిటీ, పరిసర ప్రాంతాల్లో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అతిభారీ వర్షాలు పడతాయని ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కానీ, చెన్నై వ్యాప్తంగా దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం పడింది. దాదాపు 300 ప్రాంతాలు నీట మునిగాయి. పలు సబ్ వేలో 3 అడుగులకు పైగా నీరు నిలిచింది. చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఈ జిల్లాల్లో బుధవారం కూడా రెడ్ అలెర్ట్ కొనసాగనుంది. భారీ వర్షాలు, హెచ్చరికల దృష్ట్యా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలు మూసివేయాలను తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మూసివేయలని పేర్కొంది.

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

ఇకపోతే, బంగాళాఖాతంలో ఏర్పడిన పీడనం మంగళవారం సాయంత్రం అల్పపీడనంగా మారింది. బుధవారం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి, నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో బెంగళూరు, చెన్నైలలో బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కేరళలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు. భారీ వర్షాల నేపథ్యంలో బెంళూరులో హై అలర్ట్ ప్రకటించినట్లు కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ తెలిపారు. ఇప్పటికే బెంగళూరులో సుమారు 60 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మోహరించినట్లు వెల్లడించారు. ఏదైనా అవసరం కోసం సిద్ధంగా ఉండటానికి మరో 40 మందిని మళ్లీ నియమించామన్నారు. అగ్నిమాపక , అత్యవసర సేవలను సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed